LOADING...
Scotland: స్టోన్‌హెంజ్ కంటే పురాతనం.. స్కాట్లాండ్‌లో బయటపడిన 5 వేల ఏళ్ల నాటి కృత్రిమ దీవి
స్టోన్‌హెంజ్ కంటే పురాతనం.. స్కాట్లాండ్‌లో బయటపడిన 5 వేల ఏళ్ల నాటి కృత్రిమ దీవి

Scotland: స్టోన్‌హెంజ్ కంటే పురాతనం.. స్కాట్లాండ్‌లో బయటపడిన 5 వేల ఏళ్ల నాటి కృత్రిమ దీవి

వ్రాసిన వారు Moogati Shabari
May 14, 2026
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టోన్‌హెంజ్ కంటే కూడా పురాతనమైన ఐదు వేల ఏళ్ల నాటి కృత్రిమ దీవిని స్కాట్లాండ్‌లో పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణతో ప్రాచీన కాలంలోని నిర్మాణ నైపుణ్యాలపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'క్రానోగ్'గా పిలిచే ఈ కృత్రిమ దీవి స్కాట్లాండ్‌కు చెందిన లాక్ భోర్గస్టైల్ సరస్సులో, ఐల్ ఆఫ్ లూయిస్ ప్రాంతంలో బయటపడింది. క్రానోగ్‌లు అంటే సరస్సులు, నదుల్లో రాళ్లు, కలప, పొదలతో నిర్మించిన కృత్రిమ దీవులు. ఇప్పటివరకు ఇవి ప్రధానంగా ఇనుపయుగ కాలానికి, అంటే క్రీస్తుపూర్వం 800 ప్రాంతానికి చెందినవిగా నిపుణులు భావించేవారు. అయితే తాజా పరిశోధనలు ఈ నిర్మాణాలు అంతకంటే చాలా పురాతనమైనవని సూచిస్తున్నాయి.

వివరాలు

శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం, రీడింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నీటి అడుగు సర్వేలు, తవ్వకాలు, ఆధునిక చిత్రీకరణ సాంకేతికత సహాయంతో ఈ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ దీవి మొదట సుమారు 23 మీటర్ల వెడల్పుతో భారీ కలప వేదికపై నిర్మించబడినట్లు గుర్తించారు. ముందుగా కలప, పొదల పొరలను వేసి, వాటిపై రాళ్లను అమర్చినట్లు తేలింది. ఈ అధ్యయనాన్ని పురావస్తు పరిశోధనలకు సంబంధించిన ఒక శాస్త్రీయ పత్రికలో ప్రచురించారు. "సన్నని మట్టి పొరలు, అలల ప్రభావం, తేలియాడే మొక్కలు, కాంతి ప్రతిబింబాలు వంటి కారణాల వల్ల తక్కువ లోతు ఉన్న నీటిలో చిత్రీకరణ చేయడం చాలా కష్టమవుతుంది" అని సముద్ర పురావస్తు శాస్త్రవేత్త ఫ్రేజర్ స్టర్ట్ తెలిపారు.

వివరాలు

పురావస్తు శాస్త్రవేత్తల పరిశోధనలు..

"లోతైన నీటిలో ప్రత్యేక చిత్రీకరణ సాంకేతికత చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఒక మీటర్ కంటే తక్కువ లోతు ఉన్న ప్రాంతాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఇది పురావస్తు శాస్త్రవేత్తలకు చాలాకాలంగా ఉన్న సవాలే" అని ఆయన చెప్పారు. రేడియోకార్బన్ పరీక్షల ప్రకారం ఈ నిర్మాణం క్రీస్తుపూర్వం 3640 నుంచి 3360 మధ్య కాలంలో నిర్మించబడినట్లు తేలింది. దీంతో ఇది స్టోన్‌హెంజ్ కంటే పాతదిగా నిర్ధారణ అయింది. ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో నియోలిథిక్ కాలానికి చెందిన మట్టి పాత్రల ముక్కలు కూడా లభించాయి. దీంతో ఈ దీవిని సమావేశాలు, ఆచారాలు లేదా సామూహిక విందుల కోసం ఉపయోగించి ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Advertisement

వివరాలు

బ్రిటన్ చరిత్రలో కొత్త అధ్యాయం..

ఈ ఆవిష్కరణతో బ్రిటన్‌లోని నియోలిథిక్ సమాజాలపై ఇప్పటివరకు ఉన్న అభిప్రాయాలు మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరస్సు మధ్యలో కృత్రిమ దీవి నిర్మించడానికి అవసరమైన శ్రమను బట్టి చూస్తే, అప్పటి సమాజాల్లో ప్రణాళికాబద్ధమైన వ్యవస్థతో పాటు అభివృద్ధి చెందిన నిర్మాణ నైపుణ్యాలు కూడా ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. స్కాట్లాండ్, ఐర్లాండ్ ప్రాంతాల్లో ఇంకా పరిశోధన జరగని అనేక క్రానోగ్‌లు కూడా నియోలిథిక్ యుగానికే చెందినవిగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణతో ప్రాచీన బ్రిటన్ చరిత్ర అధ్యయనంలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు చెబుతున్నారు.

Advertisement