Sugar: అంతరిక్షంలో చక్కెర అణువుల గుర్తింపు.. జీవం ఆవిర్భావంపై కొత్త ఆశలు రేకెత్తించిన శాస్త్రవేత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
విశ్వం ఒక భారీ రసాయన ప్రయోగశాలలా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు ఆ "కాస్మిక్ కిచెన్"లో చక్కెర కూడా ఉందని వారు గుర్తించారు. నేచుర్ ఆస్ట్రోనోమి జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం, ఖగోళ శాస్త్రవేత్తలు అంతర్నక్షత్ర మధ్యస్థం (Interstellar Medium-ISM)లో చక్కెర అణువుల ఉనికిని నిర్ధారించారు. ఇప్పటివరకు ఈ విశాలమైన అంతరిక్ష ప్రాంతంలో 340కిపైగా అణువులను గుర్తించారు. జీవం ఏర్పడేందుకు అవసరమైన ప్రాథమిక రసాయనాలు విశ్వమంతా ఎలా వ్యాపించాయనే విషయంపై ఈ తాజా ఆవిష్కరణ కీలక సంకేతాలను అందిస్తోంది.
వివరాలు
చక్కెర ఆనవాళ్లు గుర్తింపు..
భూమికి అవతల చక్కెర ఆనవాళ్లు లభించడం ఇదే తొలిసారి కాదు.
గతంలో ఉల్కలు, గ్రహశకలాల నమూనాల్లో రైబోస్, గ్లూకోజ్ వంటి చక్కెర అణువులను శాస్త్రవేత్తలు గుర్తించారు.
అయితే తాజా పరిశోధన ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. ఆస్ట్రోకెమిస్ట్ ఇజాస్కున్ జిమెనెజ్-సెర్రా నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఇటీవల పాలపుంత గెలాక్సీ కేంద్ర భాగంలోని దట్టమైన మాలిక్యులర్ క్లౌడ్లో నాలుగు కార్బన్ అణువులతో కూడిన ఎరిథ్రులోజ్ (Erythrulose) అనే చక్కెరను గుర్తించింది.
ఇంతకుముందు అంతరిక్షంలో గుర్తించిన చక్కెరలతో పోలిస్తే, ఎరిథ్రులోజ్ నిజమైన మోనోశాకరైడ్ కావడం విశేషం.
ముఖ్యంగా, ఎరిథ్రులోజ్ అనేది థ్రియోస్ న్యూక్లిక్ యాసిడ్ (TNA) నిర్మాణానికి అవసరమైన కీలక రసాయన పూర్వ పదార్థంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వివరాలు
జీవం ప్రారంభదశలోనే టీఎన్ఏ..
జీవం ప్రారంభ దశలో RNA, DNA కంటే ముందుగా TNA ఉండి ఉండొచ్చని పలువురు పరిశోధకులు భావిస్తున్నారు.
దీంతో RNA ఏర్పడకముందే అవసరమైన రసాయనాల మూలాలను అంతరిక్షమే అందించి ఉండొచ్చనే కొత్త అవకాశాన్ని ఈ పరిశోధన సూచిస్తోంది.
ఆశ్చర్యకరంగా, పరిశోధనలో మూడు కార్బన్ అణువులతో కూడిన గ్లిసెరాల్డిహైడ్ వంటి చక్కెరలు మాత్రం కనిపించలేదు.
దీంతో నాలుగు కార్బన్ గొలుసులు అంతరిక్షంలో నేరుగా ఎలా ఏర్పడుతున్నాయన్న దానిపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ విషయంపై జిమెనెజ్-సెర్రా మాట్లాడుతూ, "ఈ ఫలితం మాకు ఊహించని విధంగా వచ్చింది.
ఇప్పటివరకు అంతర్నక్షత్ర అణువులు ఒక్కో కార్బన్ అణువు చొప్పున కలుస్తూ పెద్దవిగా మారతాయని ఆస్ట్రోకెమిస్ట్రీలో ప్రధానంగా భావించేవారు" అని తెలిపారు.
వివరాలు
రేడియో టెలిస్కోప్ సాయంతో పరిశోధన..
ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు 40 మీటర్ల యెబెస్ (Yebes) రేడియో టెలిస్కోప్, 30 మీటర్ల IRAM రేడియో టెలిస్కోప్లను ఉపయోగించారు.
వీటి సాయంతో G+0.693-0.027 అనే మాలిక్యులర్ క్లౌడ్ను పరిశీలించి ఈ చక్కెర అణువులను గుర్తించారు.
సుమారు 4.1 నుంచి 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన లేట్ హెవీ బాంబార్డ్మెంట్ కాలంలో 5 లక్షల టన్నుల నుంచి 5 కోట్ల టన్నుల వరకు ఎరిథ్రులోజ్ భూమి ఉపరితలంపై చేరి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ చక్కెర జీవానికి నేరుగా అవసరమైనది కాదని, కానీ భూమిపై జీవం ఆవిర్భావాన్ని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించిందని భావిస్తున్న మరో రూపంగా ఇది సులభంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.