Telegram: యూజర్నేమ్ ఫీచర్ వివాదం.. కేంద్ర నోటీసుకు స్పందించిన టెలిగ్రామ్
ఈ వార్తాకథనం ఏంటి
వివాదాస్పదంగా మారిన 'యూజర్నేమ్' ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసుకు టెలిగ్రామ్ స్పందించింది. ఇప్పటికే వాట్సాప్ పంపిన సమాధానాన్ని అధికారులు పరిశీలిస్తుండగా, ఇప్పుడు టెలిగ్రామ్ నుంచి కూడా వివరణ అందినట్లు సమాచారం. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మొబైల్ నంబర్కు బదులుగా కేవలం యూజర్నేమ్ ఆధారంగా ఇతరులతో చాట్ చేసే అవకాశం కల్పించే ఫీచర్పై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ దాడులు, ఇతరుల పేరుతో మోసపూరిత ఖాతాలు సృష్టించడం వంటి ఘటనలు పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
వివరాలు
మరికొంత సమయం కోరిన వాట్సాప్
ఈ నేపథ్యంలో కేంద్రం ముందుగా మెటా సంస్థకు చెందిన వాట్సాప్కు నోటీసు జారీ చేసింది. ప్రభుత్వంతో చర్చలు పూర్తయ్యే వరకు,ప్రభుత్వం సంతృప్తి చెందే వరకు ఈ ఫీచర్ను భారత్లో అమలు చేయొద్దని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన వాట్సాప్,పూర్తి వివరణ ఇవ్వడానికి మరికొంత సమయం కోరడంతో పాటు, సంప్రదింపులు పూర్తయ్యే వరకు భారత్లో ఈ ఫీచర్ను ప్రారంభించబోమని హామీ ఇచ్చింది. వాట్సాప్ అనంతరం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY)టెలిగ్రామ్, సిగ్నల్ సంస్థలకు కూడా ఇదే అంశంపై నోటీసులు పంపింది. ప్రస్తుతం తమ ప్లాట్ఫారమ్లలో యూజర్నేమ్ ఆధారిత వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి? మోసాలు, నకిలీ ఖాతాలు,ఇతరుల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నాలను ఎలా అడ్డుకుంటున్నాయి? అనే వివరాలను సమర్పించాలని కేంద్రం కోరింది.
వివరాలు
కేంద్రం పిలుపు మేరకు MeitY అధికారులతో మెటా ప్రతినిధుల సమావేశం
భారత్లో వాట్సాప్కు సుమారు 50 కోట్ల మంది వినియోగదారులు ఉండగా,టెలిగ్రామ్ వినియోగదారుల సంఖ్య దానితో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. గత శుక్రవారం మెటా ప్రతినిధులు కేంద్రం పిలుపు మేరకు MeitY అధికారులతో సమావేశమయ్యారు. ప్రతిపాదిత ఫీచర్ విషయంలో సమాచార సాంకేతిక చట్టం (IT Act), సంబంధిత నిబంధనల ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అలాగే ప్రధాన సోషల్ మీడియా మధ్యవర్తిగా వాట్సాప్ చట్టబద్ధమైన 'డ్యూ డిలిజెన్స్' బాధ్యతలను తప్పనిసరిగా పాటించాలని గుర్తు చేసింది.
వివరాలు
ఇన్స్టాగ్రామ్ ప్రకటనల్లో అభ్యంతరకర కంటెంట్
ఇదిలా ఉండగా, ఇటీవలి రోజుల్లో మెటా, టెలిగ్రామ్ ఇతర అంశాలపైనా ప్రభుత్వ పరిశీలనను ఎదుర్కొంటున్నాయి. ఇన్స్టాగ్రామ్ ప్రకటనల్లో చిన్నారుల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన అభ్యంతరకర కంటెంట్ కనిపించడంపై మెటాకు కేంద్రం నోటీసు జారీ చేసింది. మరోవైపు టెలిగ్రామ్లో పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్ విస్తృతంగా ప్రసారం అవుతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.