India AI Impact Summit: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్కు రంగం సిద్ధం.. హాజరయ్యే ప్రముఖుల జాబితా ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత సాంకేతిక రంగంలో కీలక మైలురాయిగా నిలవనున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్', 2026 (India AI Impact Summit 2026) దేశ భవిష్యత్ కృత్రిమ మేధ (Artificial Intelligence) దిశను నిర్ణయించే వేదికగా మారనుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఏఐ రంగంలో అగ్రగాములైన మేధావులు, పరిశ్రమాధిపతులు ఈ సమిట్లో పాల్గొని ఏఐ భవిష్యత్తుపై చర్చించనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 20, 2026 వరకు ఈ ప్రతిష్ఠాత్మక సమిట్ న్యూదిల్లీలోని భారత్ మండపం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC)లో జరగనుంది. ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఉన్న ఈ వేదిక, లోతైన చర్చలు, సాంకేతిక ప్రజెంటేషన్లు, నెట్వర్కింగ్ కార్యక్రమాలకు అనువుగా ఉండనుంది. గ్లోబల్ ఏఐ లీడర్గా భారత్ ఎదగాలన్న సంకల్పాన్ని ఈ సమిట్ స్పష్టంగా ప్రతిబింబించనుంది.
Details
సమిట్ లక్ష్యం - 'సర్వజన హితాయ, సర్వజన సుఖాయ'
ఈ సమిట్కు ప్రధాన థీమ్గా 'సర్వజన హితాయ, సర్వజన సుఖాయ' అనే భావనను ఎంపిక చేశారు. అంటే - అందరి సంక్షేమం, అందరి ఆనందం లక్ష్యంగా ఏఐ అభివృద్ధి జరగాలన్నది దీని ఉద్దేశ్యం. సమిట్లో పలు కీలక అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. హెల్త్కేర్, బయోటెక్నాలజీలో ఏఐ వినియోగం, ప్రిసిషన్ మెడిసిన్, డ్రగ్ డిస్కవరీ వంటి అంశాలు ఇందులో ప్రధానంగా ఉంటాయి. సస్టెయినబుల్ ఏఐ, గ్రీన్ కంప్యూటింగ్ ద్వారా పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించే మార్గాలు, ఏఐ ఎథిక్స్, గవర్నెన్స్, ట్రస్ట్ వంటి బాధ్యతాయుత వినియోగ అంశాలపై చర్చలు జరగనున్నాయి. అదనంగా విద్యలో ఏఐ, స్మార్ట్ సిటీస్, రక్షణ,భద్రత రంగాల్లో ఏఐ వినియోగం వంటి కీలక విభాగాలు కూడా సమిట్లో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి.
Details
ప్రపంచ దిగ్గజాల హాజరు
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్కు ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజులు హాజరుకానున్నారు. ఈ జాబితాలో అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, గూగుల్ డీప్మైండ్ సీఈఓ, నోబెల్ అవార్డు గ్రహీత డెమిస్ హస్సాబిస్, మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్, ఆంథ్రోపిక్ సహవ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోడై, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వంటి ప్రముఖులు పాల్గొననున్నారు. దేశీయంగా రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిత్తల్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఈ సమిట్లో పాల్గొననున్నారు.
Details
రూ. లక్ష కోట్ల పెట్టుబడుల అవకాశం?
ఈ సమిట్ నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమిట్ ద్వారా 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. లక్ష కోట్లకు పైగా) పెట్టుబడులు వచ్చే అవకాశముందని ఆయన సూచించారు. స్టార్టప్లు చిన్న, స్థానిక అవసరాలకు అనుగుణమైన ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయాలని, అమెరికా ఆధారిత సిస్టమ్స్పై ఆధారపడకుండా స్వదేశీ సాంకేతికతను పెంపొందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో డెమిస్ హస్సాబిస్తో సమావేశమైన వైష్ణవ్, గ్లోబల్ గుడ్ కోసం ఏఐ అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు.