Y Chromosome: కనుమరుగవుతున్న వై క్రోమోజోమ్.. నిజంగానే ముప్పేనా?
ఈ వార్తాకథనం ఏంటి
పురుషుల లింగాన్ని నిర్ధారించే వై క్రోమోజోమ్ భవిష్యత్తుపై శాస్త్ర ప్రపంచంలో చాలాకాలంగా చర్చ నడుస్తోంది. గత 30 కోట్ల సంవత్సరాల్లో ఈ క్రోమోజోమ్లోని దాదాపు 97 శాతం జన్యువులు కనుమరుగయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో వై క్రోమోజోమ్ పూర్తిగా అదృశ్యమయ్యే అవకాశముందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే, దీనివల్ల పురుషుల ఉనికికే ప్రమాదమా అన్న ప్రశ్నకు నిపుణులు మాత్రం అలా కాదని స్పష్టం చేస్తున్నారు. వై క్రోమోజోమ్ భవిష్యత్తుపై ప్రముఖ శాస్త్రవేత్తలు జెన్నీ గ్రేవ్స్, జెన్ హ్యూజెస్ మధ్య ఎన్నో సంవత్సరాలుగా శాస్త్రీయ చర్చ కొనసాగుతోంది.
వివరాలు
జన్యు నష్టం ఆగిపోయి స్థిరపడిందని, ఆందోళన అవసరం లేదని మరికొందరి అభిప్రాయం
ఒకే పరిశోధన ఆధారాలను పరిశీలించినప్పటికీ, ఇద్దరూ వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2011లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో వీరి వాదనలపై నిర్వహించిన ఓటింగ్లో సమాన ఫలితం రావడం ఈ అంశం ఎంత క్లిష్టమో తెలియజేసింది. దాదాపు 20కోట్ల సంవత్సరాల క్రితం నుంచి వై క్రోమోజోమ్ పురుష లింగ నిర్ధారణలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. ఆ సమయంలో నుంచి ఇది ఎక్స్ క్రోమోజోమ్తో కలవడం తగ్గిపోయిందని, దీంతో జన్యువుల కోత వేగంగా జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, గత రెండున్నర కోట్ల సంవత్సరాలుగా ఈ తగ్గుదల దాదాపు స్థిరపడిందని, ముఖ్యమైన జన్యువులు ఇప్పటికీ భద్రంగానే ఉన్నాయని జెన్ హ్యూజెస్ వర్గం అభిప్రాయపడుతోంది.
వివరాలు
వై క్రోమోజోమ్ లేకున్నా పురుషులు అంతరించిపోరని కొందరి వాదన
మరోవైపు, ఈ స్థిరత్వం శాశ్వతం కాదని జెన్నీ గ్రేవ్స్ చెబుతున్నారు. వై క్రోమోజోమ్ క్రమంగా బలహీనపడుతోందని,దాని క్షీణత ఇంకా కొనసాగుతూనే ఉందని ఆమె వాదిస్తున్నారు. అయితే,ఒకవేళ భవిష్యత్తులో వై క్రోమోజోమ్ పూర్తిగా అదృశ్యమైనా కూడా పురుషులు అంతరించిపోరని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు జంతుప్రపంచంలో ఇప్పటికే కొన్ని ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. కొన్ని ఎలుక జాతుల్లో వై క్రోమోజోమ్ లేకపోయినా,మరో క్రోమోజోమ్ లింగ నిర్ధారణ బాధ్యతను నిర్వహిస్తోంది. ఇదే తరహా మార్పు మానవుల్లో కూడా జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాబట్టి,వై క్రోమోజోమ్ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చ ప్రస్తుతం శాస్త్ర పరిశోధనలకే పరిమితమని నిపుణులు చెబుతున్నారు. లక్షల సంవత్సరాల తర్వాత జరిగే మార్పుల గురించి ఇప్పుడే భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.