Apple: ఆపిల్ సీఈవోగా జాన్ టర్నెస్.. కొత్త బాధ్యతలు చేపట్టనున్న టిమ్ కుక్
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ సంస్థ తన నాయకత్వంలో కీలక మార్పులను ప్రకటించింది. సాంకేతిక రంగంలో పెరుగుతున్న పోటీకి తగినట్లుగా కొత్త ప్రధానాధికారిని నియమించింది. గత 15 ఏళ్లుగా సంస్థను నడిపించిన టిమ్ కుక్ తన పదవి నుంచి తప్పుకోనున్నారు. ప్రస్తుతం హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉన్న జాన్ టర్నెస్కు ప్రధానాధికారిగా బాధ్యతలు అప్పగించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ప్రధానాధికారిగా ఉన్న టిమ్ కుక్ ఇకపై సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. 2011లో బాధ్యతలు స్వీకరించిన కుక్ నాయకత్వంలో సంస్థ షేరు విలువ దాదాపు 20 రెట్లు పెరిగి ఆర్థికంగా బలమైన స్థాయికి చేరుకుంది.
వివరాలు
ఎన్విడియాతో పోటీకి సై..
ఇదే సమయంలో జానీ స్రౌజీని చీఫ్ హార్డ్వేర్ అధికారి గా నియమించారు. జాన్ టర్నెస్ ఇప్పటివరకు నాయకత్వం వహించిన హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగాన్ని సీనియర్ టామ్ మెరీబ్కు అప్పగించారు. ఈ మార్పులతో ఆపిల్ సంస్థ తన దృష్టిని కార్యకలాపాలు, ఆపరేషనల్-సప్లైచైన్ నుంచి హార్డ్వేర్, కృత్రిమ మేధస్సు వైపు మళ్లించినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా చిప్ తయారీ రంగంలో ముందున్న ఎన్విడియాతో సాంకేతికత, కృత్రిమ మేధస్సు రంగాల్లో పోటికి సిద్ధమవుతోంది. ఇటీవల ఎన్విడియా సంస్థ మార్కెట్ విలువ ఆపిల్ను మించి నిలిచింది.
వివరాలు
మ్యాక్ విక్రయాలను పెంచేందుకు 'ప్రో'
2001లో ఆపిల్లో చేరిన జాన్ టర్నెస్కు ప్రస్తుతం 50 సంవత్సరాలు. ఆయన దీర్ఘకాలం సంస్థను ముందుకు నడిపించే సామర్థ్యం ఉన్న నాయకుడిగా భావిస్తున్నారు. సంస్థకు సంబంధించిన ప్రధాన ప్రాజెక్టులైన మ్యాక్, ఐపాడ్, ఎయిర్పాడ్స్ రూపకల్పన, అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. మ్యాక్ విక్రయాలను పెంచేందుకు 'ప్రో' రూపాన్ని తీసుకువచ్చి మంచి ఫలితాలు సాధించారు.