LOADING...
ISRO: విజన్‌ 2047.. చంద్రయాన్-4 నుంచి శుక్రయాన్‌ వరకు ఇస్రో భారీ ప్రణాళికలు!
విజన్‌ 2047.. చంద్రయాన్-4 నుంచి శుక్రయాన్‌ వరకు ఇస్రో భారీ ప్రణాళికలు!

ISRO: విజన్‌ 2047.. చంద్రయాన్-4 నుంచి శుక్రయాన్‌ వరకు ఇస్రో భారీ ప్రణాళికలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2026
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ముఖ్యంగా చంద్రయాన్ మిషన్ల విజయాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారత అంతరిక్ష సామర్థ్యాలకు విశేష గుర్తింపు లభించింది. చంద్రయాన్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3 ప్రయోగాలతో తన సత్తాను చాటిన ఇస్రో ప్రస్తుతం గగన్‌యాన్‌తో పాటు భారత సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణంపై దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో చంద్రయాన్ సిరీస్‌లో నాలుగో మిషన్‌కు కూడా ఇస్రో సన్నాహాలు వేగవంతం చేసింది. జపాన్‌తో కలిసి 'లుపెక్స్‌' (LUPEX) ప్రాజెక్ట్‌ కింద 2028లో చంద్రయాన్-4 ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు చంద్రయాన్ పేరిట జరిగిన మూడు మిషన్లు చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలకే పరిమితమయ్యాయి. అయితే చంద్రయాన్-4 మిషన్‌ వాటికి భిన్నంగా ఉండనుంది.

వివరాలు

ఇస్రో చరిత్రలో మరో కీలక మైలురాయి

ఈ మిషన్‌లో చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి వాటిని తిరిగి భూమికి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగం ఇస్రో చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. అలాగే 2040 నాటికి భారత వ్యోమగాములను చంద్రుడిపైకి పంపి సురక్షిత ల్యాండింగ్‌ సాధించాలనే లక్ష్యంతో ఇస్రో ముందుకు సాగుతోంది. 2028లో జపాన్‌ సహకారంతో చేపట్టనున్న చంద్రయాన్-4 మిషన్‌ ఈ దీర్ఘకాలిక లక్ష్యానికి కీలకంగా మారనుంది. మరోవైపు భారత తొలి అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం ఐదు మాడ్యూళ్లతో నిర్మించనున్న ఈ స్పేస్‌ స్టేషన్‌లో తొలి మాడ్యూల్‌ను 2028 నాటికి ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

వివరాలు

'శుక్రయాన్‌' మిషన్‌పై పనులు ప్రారంభించిన ఇస్రో  

2035 నాటికి భారత సొంత అంతరిక్ష కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఉంది. ఇదిలా ఉండగా, శుక్రగ్రహ అధ్యయనం కోసం 'శుక్రయాన్‌' మిషన్‌పై కూడా ఇస్రో ఇప్పటికే పనులు ప్రారంభించింది. 2047 నాటికి అత్యంత ప్రతిష్టాత్మక, భారీ స్థాయి అంతరిక్ష ప్రయోగాలను చేపట్టేందుకు సంస్థ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే చంద్రయాన్‌, ఆదిత్య-ఎల్1, సముద్రయాన్‌ వంటి మిషన్లను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో ఇప్పుడు శుక్రగ్రహంపై పరిశోధనలకు సిద్ధమవుతోంది. చంద్రుడితో పోలిస్తే శుక్రగ్రహంపై వాతావరణ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. చంద్రుడిపై వాతావరణం లేకపోగా, శుక్రగ్రహంపై కార్బన్‌డయాక్సైడ్‌ అధికంగా ఉంటుంది.

Advertisement

వివరాలు

అక్కడి ఉష్ణోగ్రతలు 90 శాతం ఎక్కువ 

భూమితో పోలిస్తే అక్కడి ఉష్ణోగ్రతలు దాదాపు 90 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. శుక్రయాన్‌ మిషన్‌ ద్వారా శుక్రగ్రహ వాతావరణ పరిస్థితులు, అగ్నిపర్వతాల స్వభావం, అయోనోస్ఫియర్‌ లక్షణాలు వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని ఇస్రో భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక శాస్త్రీయ పరికరాలను కూడా అభివృద్ధి చేస్తోంది. అంతేకాకుండా, 2047లో చేపట్టబోయే కీలక అంతరిక్ష ప్రయోగాలకు భారత సొంత స్పేస్‌ స్టేషన్‌ ప్రధాన వేదికగా మారనుంది. భవిష్యత్తులో అక్కడి నుంచే కీలక మిషన్లను నిర్వహించేలా ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Advertisement