WhatsApp: యాప్ ఓపెన్ చేయకుండానే వాయిస్ నోట్స్ పంపే ఫీచర్.. త్వరలో వాట్సాప్లోకి..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో కొత్త ఫీచర్ను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యాప్ను ఓపెన్ చేయకుండానే వాయిస్ మెసేజ్లను రికార్డ్ చేసి పంపే అవకాశం వినియోగదారులకు లభించనుంది. ఆండ్రాయిడ్ యాప్లో గుర్తించిన వివరాల ప్రకారం, హోమ్ స్క్రీన్ విడ్జెట్ ద్వారా నేరుగా వాయిస్ నోట్స్ రికార్డ్ చేసి పంపే సదుపాయాన్ని వాట్సాప్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రారంభ దశలో ఉండగా, దీని డిజైన్, పనితీరు ఇప్పటికే రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం.
వివరాలు
వాయిస్ అప్డేట్లను మరింత వేగంగా..
వాట్సాప్ బీటా అప్డేట్లను పరిశీలించే డబ్ల్యుఏ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం, ఈ కొత్త విడ్జెట్ ఫోన్ హోమ్ స్క్రీన్పైనే కనిపిస్తుంది. ఇది వాయిస్ మెసేజ్లను రికార్డ్ చేయడానికి షార్ట్కట్గా పనిచేస్తుంది. నివేదికలో వెల్లడించిన ప్రివ్యూ చిత్రాల ప్రకారం, ఈ విడ్జెట్ తొలుత 3x1 కాంపాక్ట్ పరిమాణంలో కనిపించే అవకాశం ఉంది. హోమ్ స్క్రీన్కు జోడించిన తర్వాత వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా దీని పరిమాణాన్ని మార్చుకునే వీలూ ఉండనుంది. అంతేకాకుండా, ఈ వాయిస్ నోట్స్ను స్టేటస్ అప్డేట్లుగా కూడా షేర్ చేసే అవకాశం కల్పించేలా వాట్సాప్ పనిచేస్తున్నట్లు సమాచారం. దీంతో వినియోగదారులు తమ వాయిస్ అప్డేట్లను మరింత వేగంగా స్టేటస్గా పోస్ట్ చేయగలుగుతారు.
వివరాలు
స్టేటస్ అప్డేట్ల కోసం ప్రత్యేక హోమ్ స్క్రీన్..
ఇదిలా ఉంటే, స్టేటస్ అప్డేట్ల కోసం ప్రత్యేక హోమ్ స్క్రీన్ విడ్జెట్ను కూడా మెటా యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ తీసుకురావచ్చని తెలుస్తోంది. దీని ద్వారా యాప్ను ఓపెన్ చేయకుండానే ఇటీవల వచ్చిన స్టేటస్లను చూడటంతో పాటు, కొత్త స్టేటస్ను కూడా వెంటనే పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, వాయిస్ మెసేజ్ విడ్జెట్లాగే ఈ ఫీచర్ కూడా ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఎంపిక చేసిన కొందరు బీటా టెస్టర్లకే ఇది అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
వివరాలు
వాయిస్ విడ్జెట్లో మరో ఉపయోగకరమైన ఫీచర్..
ఇక వాయిస్ విడ్జెట్లో మరో ఉపయోగకరమైన ఫీచర్ కూడా ఉండనున్నట్లు నివేదిక వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు ఒకేసారి పలువురు వాట్సాప్ కాంటాక్ట్లను ఎంపిక చేసి, అదే వాయిస్ మెసేజ్ను అందరికీ పంపే అవకాశం పొందుతారు. అయితే ఈ ఫీచర్ను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై వాట్సాప్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ముందుగా బీటా వెర్షన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చి, అనంతరం స్టేబుల్ వెర్షన్ వినియోగదారులకు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.