Eye in the Sky: వరుస వైఫల్యాల తర్వాత ఇస్రోకు భారీ ఊరట.. EOS-05 సక్సెస్ ఇస్రోకు ఎందుకింత కీలకం?
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక విజయాన్ని అందుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. చిమ్మచీకటిగా ఉన్న ఆకాశాన్ని వెలుగులతో నింపుతూ వెళ్లిన ఈ రాకెట్.. దేశ తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా పేర్కొంటున్న EOS-05ను మోసుకెళ్లింది. 'స్మార్ట్ బాయ్'గా పిలుస్తున్న ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించిన 18 నిమిషాలకే జీఎస్ఎల్వీ నిర్దేశిత సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో విజయవంతంగా ప్రవేశపెట్టింది. EOS-05 ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ ప్రకటించారు. జీఎస్ఎల్వీ-ఎఫ్17 వాహనం అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం EOS-05ను నిర్దేశిత కక్ష్యలోకి కచ్చితంగా ప్రవేశపెట్టిందని తెలిపారు.
వివరాలు
EOS-05 ప్రత్యేకత ఏమిటి?
ఉపగ్రహం ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉందని చెప్పారు. ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి గొప్ప విజయమని అభివర్ణించారు.
EOS-05 అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం. దీనిని GISAT-1A అని కూడా పిలుస్తారు.
జియోసింక్రోనస్ కక్ష్య నుంచి పనిచేసేలా రూపొందించిన భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
సాధారణంగా లో ఎర్త్ ఆర్బిట్లో ఉండే ఉపగ్రహాలు ఒక ప్రాంతం మీదుగా కొంత వ్యవధికి ఒకసారి మాత్రమే వెళ్తాయి.
అయితే EOS-05 దాదాపు 36 వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి భారత భూభాగాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను నిరంతరం గమనించగలదు.
దీంతో దేశంలోని వివిధ ప్రాంతాలపై మరింత కచ్చితమైన, నిరంతర పరిశీలన సాధ్యమవుతుంది.
వివరాలు
EOS-05 ప్రత్యేకత ఏమిటి?
వాతావరణ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, మౌలిక వసతుల పర్యవేక్షణ, భూభాగంపై సాధారణ నిఘా వంటి కీలక అంశాల్లో ఈ ఉపగ్రహం నుంచి అందే సమాచారం ఉపయోగపడనుంది.
ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత అన్ని వాల్వ్లు సక్రమంగా పనిచేస్తున్నాయని, సౌర ఫలకాలు కూడా విజయవంతంగా విప్పుకున్నాయని నారాయణన్ తెలిపారు.
ఉపగ్రహం ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో దాని కక్ష్యను మరింత పెంచి, అవసరమైన జియో ప్లాట్ఫామ్లోకి తీసుకెళ్లి దేశ అవసరాలకు వినియోగిస్తామని వివరించారు.
మొత్తంగా చూస్తే EOS-05 భారత్కు ఆకాశంలో ఒక 'కన్ను'లా పనిచేయనుంది.
రియల్టైమ్ చిత్రాలను అందించడంతో పాటు వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, విపత్తుల నిర్వహణ వంటి రంగాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది.
వివరాలు
రెండో ప్రయత్నంలో విజయం
భారత అంతరిక్ష సామర్థ్యాలు మరింత ఉన్నత స్థాయికి చేరుతున్నాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
కనిపించే కాంతి, ఇన్ఫ్రారెడ్, మల్టీస్పెక్ట్రల్, హైపర్స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన చిత్రాలను అందించే సామర్థ్యం EOS-05కు ఉందని తెలిపారు.
EOS-05 ప్రయోగం మరో కారణంతోనూ ఇస్రోకు చాలా ప్రత్యేకమైనది.
2021లో విఫలమైన GISAT-1 స్థానంలో దీన్ని రూపొందించారు. 2021 ఆగస్టు 12న ఇస్రో EOS-03ను ప్రయోగించింది.
దీన్నే GISAT-1గా కూడా పిలుస్తారు. అయితే జీఎస్ఎల్వీ మార్క్-2 రాకెట్లో మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చలేకపోయారు.
ఆ తర్వాత GISAT-1A ప్రయోగానికి దాదాపు ఐదేళ్లు పట్టింది.
ఈ ఆలస్యానికి కారణం ఏంటన్న విషయంపై ఇస్రో స్పష్టమైన వివరాలను వెల్లడించలేదు.
వివరాలు
రెండో ప్రయత్నంలో విజయం
ఉపగ్రహం తయారీ, పేలోడ్ అభివృద్ధి, మారిన అవసరాలు, రాకెట్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాల్లో ఏది ప్రభావం చూపిందో వెల్లడించలేదు.
అయితే గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని జీఎస్ఎల్వీ సామర్థ్యాన్ని దశలవారీగా పెంచామని నారాయణన్ తెలిపారు.
మొదట ఈ రాకెట్ ద్వారా 1,536 కిలోల పేలోడ్ను ప్రయోగించామని, నిర్మాణ బరువును తగ్గించడం, ప్రొపల్షన్ వ్యవస్థను మెరుగుపరచడం వంటి చర్యలతో సామర్థ్యాన్ని పెంచామని చెప్పారు.
తాజాగా 2,367 కిలోల బరువున్న అత్యంత భారీ ఉపగ్రహాన్ని ఇదే వాహనం ద్వారా కక్ష్యలోకి పంపినట్లు వివరించారు.
వివరాలు
వరుస వైఫల్యాల తర్వాత ఊరట
EOS-05 విజయం ఇస్రోకు మరో కారణంతోనూ ఎంతో కీలకం. ఇటీవల కొన్ని ప్రయోగాల్లో ఎదురైన వైఫల్యాల తర్వాత ఈ విజయం సంస్థకు పెద్ద ఊరటనిచ్చింది.
2025 జనవరిలో నావిగేషన్ ఉపగ్రహం NVS-02ను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చడంలో ఇస్రో విఫలమైంది.
ఉపగ్రహాన్ని సరైన వృత్తాకార కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన ప్రయత్నాలు సఫలం కాలేదు.
దీంతో దాన్ని ఉద్దేశించిన నావిగేషన్ సేవలకు ఉపయోగించలేకపోయారు. అదే ఏడాది మే 18న PSLV-C61 ద్వారా EOS-09ను ప్రయోగించే ప్రయత్నం కూడా విఫలమైంది.
శ్రీహరికోట నుంచి రాకెట్ నింగిలోకి ఎగిరిన కొద్దిసేపటికే మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ మిషన్ను పూర్తి చేయలేకపోయామని ఇస్రో ప్రకటించింది.
వివరాలు
వరుస వైఫల్యాల తర్వాత ఊరట
ఇక 2026 జనవరిలో EOS-N1 లేదా 'అన్వేష' ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చే ప్రయత్నం కూడా విఫలమైంది.
రాకెట్ మూడో దశ చివరి దహన సమయంలో కీలక సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ మిషన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
ఇస్రోలో శాస్త్రవేత్తల ఉద్యోగ విరమణల అంశం కూడా ఆందోళన కలిగించింది.
కొన్ని నెలల వ్యవధిలో 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా చేశారని లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారని జులైలో వార్తలు వచ్చాయి.
దీంతో అంతరిక్ష శాఖ జోక్యం చేసుకుని గగన్యాన్ వంటి కీలక మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణలపై కొత్త ఆంక్షలు విధించింది.
వివరాలు
ఇకపై చేపట్టనున్న ప్రయోగాలు
2026 జనవరి 12న EOS-N1ను మోసుకెళ్లిన PSLV-C62 విఫలమైన తర్వాత ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం EOS-05.అందుకే ఈ విజయం సంస్థకు ఎంతో ప్రాధాన్యమైనదిగా మారింది.
ఇది మరో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపిన విజయంగా మాత్రమే కాకుండా,కీలక సమయంలోనూ తాము విజయవంతంగా మిషన్లను పూర్తి చేయగలమని నిరూపించిన సందర్భంగానూ ఇస్రోకు ఉపయోగపడింది.
ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో మరో ఆరు ప్రయోగాలను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో ఛైర్మన్ తెలిపారు.
వీటిలో గగన్యాన్ మానవసహిత అంతరిక్ష ప్రయోగ కార్యక్రమానికి సంబంధించిన తొలిమానవ రహిత మిషన్ కూడా ఉంది.
ఈఏడాది చివర్లో గగన్యాన్కు సంబంధించిన కీలక ప్రయోగాన్ని చేపట్టే అవకాశం ఉంది.
EOS-05 విజయంతో ఇస్రోకు కొత్త ఉత్సాహం లభించగా.. రానున్న ప్రయోగాలపై అంచనాలు మరింత పెరిగాయి.