Youtube Tv: స్మార్ట్ టీవీ చూస్తున్నవారికి యూట్యూబ్ షాక్.. పెరుగుతున్న ప్రకటనల వ్యవధి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ స్మార్ట్ టీవీల్లో ప్రకటనల విధానంలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో భాగంగా,స్కిప్ చేయలేని ప్రకటనల వ్యవధిని భారీగా పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇకపై 90 సెకన్ల వరకు స్కిప్ చేయలేని ప్రకటనలను చూపించే అవకాశమున్నట్లు సమాచారం. ఆదాయం పెంచుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై సంస్థ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇప్పటివరకు స్మార్ట్ టీవీల్లో గరిష్టంగా 30 సెకన్ల స్కిప్ చేయలేని ప్రకటనలే కనిపించేవి. ఇప్పుడు వాటి స్థానంలో 90సెకన్ల ప్రకటనలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా 20 నుంచి 40 నిమిషాల నిడివి గల వీడియోలకు ఈ విధానం అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
వివరాలు
ప్రకటనలతో ఆదాయం పెంపు ప్రయత్నం
ఇప్పటికే కొంతమంది వినియోగదారులకు ఈ 90 సెకన్ల ప్రకటనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సంప్రదాయ ప్రకటనదారులను ఆకర్షించడం, మరోవైపు ప్రకటనలు లేకుండా చూడాలనుకునే వినియోగదారులను ప్రీమియం సేవల వైపు మళ్లించడం ఈ మార్పు వెనుక ఉద్దేశమని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విధానం కేవలం స్మార్ట్ టీవీలకే పరిమితమవుతుందా లేదా మొబైల్ ఫోన్లకూ విస్తరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.