T20 World Cup 2026:విరాట్ నుంచి రోహిత్ వరకు.. టీ20 ప్రపంచకప్లలో అతధిక పరుగులు చేసిన ఇండియన్ స్టార్స్!
ఈ వార్తాకథనం ఏంటి
మరి కొన్ని రోజుల్లోనే క్రికెట్ అభిమానులకు అసలైన సంబరాలు మొదలుకానున్నాయి. పొట్టి క్రికెట్కు రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 ప్రపంచకప్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీకి ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంది. తొలిసారిగా ఈ మెగా ఈవెంట్లో మొత్తం 20 జట్లు పోటీ పడుతున్నాయి. అలాగే ఆసియా ఖండం నుంచి ఏకంగా 8 జట్లు బరిలోకి దిగడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.
వివరాలు
భారత స్టార్ ఆటగాళ్ల హవా
ప్రపంచకప్ ఆరంభానికి చాల తక్కువ సమయమే మిగిలి ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్న టీమిండియా మరోసారి కప్ సాధించి తన ఆధిపత్యాన్ని చాటాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో గత టీ20 ప్రపంచకప్ల గణాంకాలను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా గత ఐదు టీ20 ప్రపంచకప్లలో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత స్టార్ ఆటగాళ్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో ఒక ఆటగాడు ఒక్కసారి కాదు, పలుమార్లు ఈ ఘనతను సాధించి రికార్డుల మెషిన్గా నిలిచాడు.
#1
విరాట్ కోహ్లీ విశ్వరూపం (2014)
2014 టీ20 ప్రపంచకప్ భారత అభిమానులకు నిరాశనే మిగిల్చినప్పటికీ, విరాట్ కోహ్లీ ప్రదర్శన మాత్రం మరిచిపోలేనిది. ఆ ఏడాది టైటిల్ను చేజార్చుకున్న భారత్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. అయితే ఆ టోర్నీలో కోహ్లీ బ్యాటింగ్లో విశ్వరూపం చూపించాడు. కేవలం ఆరు మ్యాచ్ల్లోనే 314 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఆ సమయంలో కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉండి ప్రత్యర్థి బౌలర్లపై పరుగుల వర్షం కురిపించాడు.
#2
వన్ మ్యాన్ ఆర్మీగా కోహ్లీ (2016)
2016లో స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత జట్టు సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలైంది. అయినప్పటికీ ఆ టోర్నీ మొత్తం విరాట్ కోహ్లీ 'వన్ మ్యాన్ ఆర్మీ'లా పోరాడాడు. జట్టు ఒత్తిడిలో ఉన్న ప్రతి సందర్భంలోనూ బాధ్యత తన భుజాలపై వేసుకుని పరుగులు రాబట్టాడు. ఆ ఎడిషన్లో కూడా భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లీనే నిలిచాడు. ఐదు మ్యాచ్ల్లో 273 పరుగులు చేసి తన స్థిరత్వాన్ని మరోసారి నిరూపించాడు.
#3
కేఎల్ రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్ (2021)
ఈ జాబితాలో మూడో స్థానంలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. 2021 టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ప్రదర్శన అభిమానులను నిరాశపరిచినా, రాహుల్ మాత్రం తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఆ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రాహుల్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఐదు మ్యాచ్ల్లో 194 పరుగులు సాధించి, ఆ ఎడిషన్లో టీమిండియా టాప్ స్కోరర్గా నిలిచాడు.
#4
రికార్డుల రారాజు మళ్ళీ విరాటే (2022)
2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్లో కూడా విరాట్ కోహ్లీ తన సత్తాను చాటాడు. ఆ టోర్నీలోనూ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఘనతను విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఎడిషన్లో కోహ్లీ తన టీ20 అంతర్జాతీయ కెరీర్లో ఏకైక శతకాన్ని నమోదు చేయడం మరో విశేషం. ఆరు మ్యాచ్ల్లో ఆరు ఇన్నింగ్స్లు ఆడి మొత్తం 296 పరుగులు చేసి మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు.
#5
హిట్మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ (2024)
2024 టీ20 ప్రపంచకప్ మాత్రం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. దాదాపు 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత్ మరోసారి టీ20 ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా విశ్వవిజేతగా అవతరించింది.కెప్టెన్గా మాత్రమే కాదు, బ్యాట్స్మన్గా కూడా రోహిత్ ముందుండి జట్టును నడిపించాడు. ఆ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఆ ఏడాది రోహిత్ మొత్తం ఎనిమిది మ్యాచ్ల్లో 257 పరుగులు చేశాడు.ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 98 పరుగులతో ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ అభిమానులకు ఇప్పటికీ గుర్తుండి పోతుంది. ప్రపంచకప్ విజయం అనంతరం రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ ఇద్దరూ టీ20 అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.