PCB: పాకిస్థాన్ క్రికెట్లో కీలక పరిణామం.. సెలక్షన్ కమిటీలో భారీ మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ సెలక్షన్ కమిటీలో చోటు దక్కించుకున్న మాజీ అంపైర్ 'అలీమ్ దార్' తన పదవికి రాజీనామా చేయడంతో, అతడి స్థానంలో ఇద్దరు మాజీ కెప్టెన్లను ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ జట్టు ఆశించిన ఫలితాలు సాధించకపోవడం ఈ పరిణామాలకు ప్రధాన కారణంగా మారింది.
Details
సూపర్-8లోనే పాకిస్తాన్కు షాక్
టోర్నీలో గ్రూప్ దశలో సంతృప్తికర ప్రదర్శన చేసిన 'సల్మాన్ అఘా' నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు, సూపర్-8 దశలో మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఫలితంగా సెమీ ఫైనల్కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ పరాజయాల తర్వాత జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు బాబర్ అజమ్, షాబాద్ ఖాన్, షాహీన్ అఫ్రిది ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.
Details
అలీం దర్ రాజీనామా వెనుక కారణాలు ఇవే
ఈ నేపథ్యంలో సెలక్టర్గా ఉన్న అలీం దర్ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. సమాచారం ప్రకారం, శ్రీలంకలో జరగనున్న మ్యాచ్ల దృష్ట్యా జట్టు ఎంపిక విషయంలో హెడ్కోచ్ 'మైక్ హెస్సన్' సెలక్టర్ ఆకిబ్ జావేద్, బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్లను జట్టులో కొనసాగించాలని పట్టుబట్టారు. అయితే అలీం దర్ దీనికి వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ను జట్టులోకి తీసుకోవాలని అలీం దర్ వాదించినప్పటికీ, మిగతా సభ్యులు అందుకు ఒప్పుకోలేదని సమాచారం. ఈ పరిణామాలతో అసంతృప్తికి గురైన ఆయన చివరకు తన పదవికి రాజీనామా చేశారు.
Details
సెలక్షన్ కమిటీలోకి మాజీ కెప్టెన్లు
అలీం దర్ రాజీనామా అనంతరం పీసీబీ జాతీయ సెలక్షన్ కమిటీలో ఇద్దరు మాజీ కెప్టెన్లకు చోటు కల్పించింది. మిస్బా-ఉల్-హక్, సర్ఫరాజ్ అహ్మద్లను మెన్స్ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా నియమించింది. వీరు ఇప్పటికే ఉన్న ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్లతో కలిసి సెలక్టర్లుగా పని చేయనున్నారు.
Details
గతంలో వారి అనుభవం
మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ గతంలో పాకిస్తాన్ అండర్-19 జట్టుకు, అలాగే పాక్ షాహీన్స్కు మెంటార్గా సేవలందించాడు. మరోవైపు మిస్బా ఉల్ హక్ పాకిస్తాన్ జట్టు హెడ్కోచ్గా, చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు నిర్వహించాడు. అంతేకాకుండా పీసీబీ క్రికెట్ టెక్నికల్ కమిటీలో సభ్యుడిగానూ పనిచేశాడు. ఇప్పుడు మరోసారి సెలక్టర్గా తిరిగి వచ్చాడు. ఇక టోర్నీలో సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం పాకిస్థాన్ జట్టు వైఫల్యానికి కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.