Rinku Singh: రింకూ సింగ్కు అరుదైన గౌరవం.. కీలక పదవితో యూపీ సర్కార్ సర్ప్రైజ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెటర్ రింకూ సింగ్ మరో కొత్త బాధ్యతను చేపట్టబోతున్నాడు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ప్రాంతీయ క్రీడా అధికారిగా నియమించేందుకు సిద్ధమైంది. ఈ పరిపాలనా బాధ్యతల ద్వారా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఆయన తోడ్పడనున్నారు. ఈరోజు లక్నోలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రింకుకు ఈ బాధ్యతలను అధికారికంగా అప్పగించనున్నారు. భారత జట్టుకు అద్భుత ప్రదర్శనలు అందించినందుకు ముఖ్యంగా టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 విజయంలో భాగస్వామిగా నిలిచినందుకు ఈ గౌరవం లభిస్తోంది.
వివరాలు
క్రీడాశాఖలో కొత్త బాధ్యతలు
వాస్తవానికి 2025 జనవరిలో క్రీడా కోటా కింద రింకూ సింగ్ను ప్రాథమిక విద్యాశాఖలో బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఎస్ఏ)గా నియమించాలని ప్రభుత్వం భావించింది. 2022 ప్రత్యేక నిబంధనల కింద ఆయన ఎంపికను ప్రతిపాదించి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయమని సూచించింది. అయితే విద్యా అర్హతలపై వివాదం తలెత్తడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు ఆ సమస్యల తర్వాత క్రీడాశాఖలో కొత్త బాధ్యతను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా రింకూ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్కు సిద్ధమవుతున్నాడు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహక ప్యాకేజీని కూడా ప్రకటించింది. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు బహుమతులు, అవార్డులు అందించనున్నారు.
వివరాలు
నేడు నియామక పత్రాలు పంపిణీ
ఈ క్రమంలో మొత్తం ఆరుగురు అంతర్జాతీయ పతక విజేతలకు ఉద్యోగాలు ఇవ్వనున్నారు. పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ ఆటగాడు రాజ్కుమార్ పాల్ను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా నియమించనున్నారు. అదే విధంగా పారాలింపిక్స్ హైజంప్ గోల్డ్ మెడలిస్ట్ ప్రవీణ్ కుమార్కు కూడా డీఎస్పీ హోదా ఇవ్వనున్నారు. అలాగే జావెలిన్ త్రోలో రజత పతకం సాధించిన అజిత్ సింగ్ 200 మీటర్ల బ్రాంజ్ మెడలిస్ట్ సిమ్రన్లకు జిల్లా పంచాయతీ రాజ్ అధికారి పదవులు ఇవ్వనున్నారు. పారాలింపిక్స్లో 100 మీటర్లు 200 మీటర్ల ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించిన ప్రీతిపాల్ను బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ (బీడీవో)గా నియమించనున్నారు. మొత్తం ఆరుగురు క్రీడాకారులకు నేటి సన్మాన కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేయనున్నారు.
వివరాలు
ఈ అవార్డుల కింద ఒక్కొక్కరికి రూ.3.11 లక్షల నగదు బహుమతి
2024-25 సంవత్సరానికి గాను లక్ష్మణ్ అవార్డు, రాణి లక్ష్మీబాయి అవార్డులతో తొమ్మిది మంది క్రీడాకారులను సత్కరించనున్నారు. ఈ అవార్డుల కింద ఒక్కొక్కరికి రూ.3.11 లక్షల నగదు బహుమతి, కాంస్య ప్రతిమ ఇవ్వనున్నారు. అదనంగా 14 మంది క్రీడాకారులకు రూ.1.64 కోట్ల నగదు బహుమతులు, మరో 19 మందికి ఎకలవ్య క్రీడా నిధి కింద రూ.8.75 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ చర్యలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందిస్తూ, రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.