Abhishek Sharma: అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడు.. కానీ ఎదుర్కొనేందుకు సిద్ధమే : మిచెల్ మార్ష్
ఈ వార్తాకథనం ఏంటి
భారత విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మను ఎదుర్కొనేందుకు తమ జట్టు పూర్తిగా సిద్ధంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తెలిపారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ రేపు(అక్టోబర్ 29)కాన్బెర్రాలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన మార్ష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ అద్భుతమైన నైపుణ్యం కలిగిన ఆటగాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. అతన్ని ఎదుర్కోవడం మా జట్టుకు ఓ పెద్ద సవాలు. కానీ మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లతో తలపడే అవకాశం వచ్చినప్పుడు మన సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని మార్ష్ అన్నారు. అలాగే జోష్ ఇంగ్లిస్ అందుబాటులో ఉన్నాడని ఆయన వెల్లడించారు.
Details
రేపే టీ20 మ్యాచ్
ఇటీవల న్యూజిలాండ్ సిరీస్లో గాయంతో జట్టుకు దూరమైన ఇంగ్లిస్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడని చెప్పారు. 'ఇంగ్లిస్ ఫిట్నెస్ సాధించాడు. అతడు జట్టుకు అత్యంత కీలక ఆటగాడు. ఈ సిరీస్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడని వివరించారు. ఇక అభిషేక్ శర్మ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో ఒకరిగా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు 23 ఇన్నింగ్స్ల్లో 36.91సగటుతో 849 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. టీమిండియా, ఆస్ట్రేలియా ఇప్పటివరకు మొత్తం 32 టీ20 మ్యాచ్లు ఆడగా, వాటిలో 20లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా 11 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. ముఖ్యంగా గత మూడు టీ20 సిరీస్ల్లోనూ భారత జట్టు కంగారూలపై ఆధిపత్యం చాటింది.