Abhishek Sharma : వచ్చే మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడతాడా? సిరాజ్ ఏమన్నాడంటే..
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అంటేనే ప్రత్యర్థి బౌలర్లకు గుబులు. క్రీజులో అడుగుపెట్టిన నిమిషం నుంచే దూకుడే అతడి అసలైన ఆయుధం. తొలి బంతి నుంచే బౌండరీల వేట మొదలుపెట్టి, ఫోర్లు-సిక్సులతో క్షణాల్లో స్కోర్బోర్డును పరుగుల వరదలా మార్చేస్తాడు. అందుకే మ్యాచ్ ఆరంభానికి ముందే అభిషేక్ను ఎలా కట్టడి చేయాలన్న దానిపై ప్రత్యర్థి జట్లు ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగుతుంటాయి. ఇటీవల టీ20 టోర్నీల్లో అద్భుత ఫామ్లో కనిపించిన అభిషేక్ శర్మ, టీ20 వరల్డ్కప్ తొలి మ్యాచ్లో యూఎస్ఏపై మాత్రం ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.
వివరాలు
మైదానంలో కనిపించని అభిషేక్
శనివారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్, యూఎస్ఏపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ పోరులో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయగా, ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. అయితే మ్యాచ్లో భారత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అభిషేక్ మైదానంలో కనిపించకపోవడం గమనార్హం. దీంతో అతడికి గాయం అయ్యిందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, అభిషేక్ శర్మతో పాటు జస్ర్పీత్ బుమ్రా అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించాడు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరిగే తదుపరి మ్యాచ్లో వారు ఆడే అంశంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందని కూడా తెలిపాడు.
వివరాలు
అభిషేక్ శర్మ ఆరోగ్యంపై స్పందించని మహమూద్ సిరాజ్
ఇదిలా ఉండగా, మీడియాతో మాట్లాడిన టీమిండియా బౌలర్ మహమూద్ సిరాజ్ అభిషేక్ శర్మ ఆరోగ్యంపై స్పందించాడు. అభిషేక్ కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే ఫీల్డింగ్ సమయంలో మైదానంలోకి రాలేదని చెప్పాడు. అలాగే వచ్చే మ్యాచ్లో బ్యాట్తో తనదైన మ్యాజిక్ చూపిస్తాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సిరాజ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే అభిషేక్ శర్మకు స్వల్ప అనారోగ్యమే ఉన్నట్లు తెలుస్తోంది. అతడు త్వరగా కోలుకుని ఫిట్గా ఉంటే వచ్చే మ్యాచ్లో తుది జట్టులోకి వస్తాడని, లేదంటే తదుపరి మ్యాచ్లకు అందుబాటులోకి వచ్చే అవకాశముందని వారు స్పష్టంగా చెప్పకపోయినా సంకేతాలిచ్చినట్లయ్యింది.