Asia Cup Rising Stars: సెమీ ఫైనల్ చేరిన టీమిండియా.. అదరగొట్టిన హర్ష్ దూబే..!
ఈ వార్తాకథనం ఏంటి
దోహాలో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ క్రికెట్ టోర్నమెంట్లో గ్రూప్-B మ్యాచ్లో భారత్, ఒమాన్పై ఘనవిజయం సాధించింది. ఒమాన్ నిర్ణయించిన 136 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 17.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి, 6 వికెట్ల తేడాతో మ్యాచ్ను కైవసం చేసుకుంది. ఈ పోరులో బ్యాట్, బంతి రెండింటితో మెరిసిన హర్ష్ దుబే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు. టాస్ గెలిచిన ఒమాన్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. వారి ఇన్నింగ్స్ లో కెప్టెన్ హమ్మాద్ మిర్జా 16 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.
వివరాలు
ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా
తరువాత వసీమ్ అలీ 45 బంతుల్లో 54 పరుగులు ఆడి జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. భారత బౌలింగ్ విభాగంలో సుయాష్ శర్మ 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. గుర్జప్నీత్ సింగ్ కూడా 2 వికెట్లు దక్కించుకుని ఒమాన్ పెద్ద స్కోర్ వైపు దూసుకెళ్లకుండా అడ్డుకున్నాడు. తరువాత 136 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు వచ్చిన టీమ్ ఇండియా ఆరంభంలోనే రెండు వికెట్లు త్వరగా కోల్పోయినా, అనంతరం హర్ష్ దుబే (44 బంతుల్లో 53) అద్భుతంగా ఆడాడు. అతనితో పాటు నమన్ ధీర్ (30) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో చేరిన నేహల్ వాధేరా 23 పరుగులతో మ్యాచ్ను మరింత సులభం చేశాడు.
వివరాలు
4 పాయింట్లు సాధించి సెమీఫైనల్ స్థానం ఖరారు
ఫలితంగా భారత్కు ఇంకా 18 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం పూర్తయింది. ఒమాన్ బౌలర్లలో జయ ఓడద్రా, షఫీఖ్ జాన్, సమయ్ శ్రీవాస్తవ, ఆర్యన్ బిష్ట్ తలో ఒక వికెట్ తీసినా, భారత బ్యాట్స్మెన్ దూకుడు ఎదిరించలేకపోయారు. ఈ విజయంతో గ్రూప్-Bలో భారత 'A' జట్టు మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు, ఒక పరాజయంతో మొత్తం 4 పాయింట్లు సాధించి సెమీఫైనల్ స్థానం ఖరారు చేసుకుంది.