IND vs PAK : ఆసియా క్రీడల్లో భారత్-పాక్ మ్యాచ్.. జరగాలంటే ఇదొక్కటే మార్గం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా క్రీడలు 2026లో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జపాన్లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. గతంలో హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత జట్లు.. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈసారి ఆసియా క్రీడల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగాలంటే రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఇరు జట్లు స్వర్ణ పతకం కోసం ఫైనల్లో తలపడాలి. లేదంటే కాంస్య పతకం కోసం జరిగే ప్లే-ఆఫ్ మ్యాచ్లో పోటీ పడాలి.
వివరాలు
15 మంది సభ్యులతో కూడిన జట్టు..
అంటే.. ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరగాలంటే భారత్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ చేరాలి లేదా రెండూ సెమీఫైనల్లో ఓడిపోవాలి.
ఈ టోర్నీలో అన్ని మ్యాచ్లు పూర్తి అంతర్జాతీయ హోదాతో టీ20 ఫార్మాట్లో జరగనున్నాయి.
పురుషుల విభాగంలో టాప్ సీడ్ జట్లుగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించాయి.
మిగిలిన నాలుగు స్థానాల కోసం ఇతర జట్లు గ్రూప్ దశలో పోటీపడనున్నాయి.
భారత పురుషుల జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్గా, యువ ఆటగాడు తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
15 మంది సభ్యులతో కూడిన జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు దక్కింది.
వివరాలు
రెండు విభాగాల్లో బరిలోకి దిగుతున్న భారత్..
మహిళల విభాగంలో సెప్టెంబర్ 17 నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి.
క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు జపాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే సెమీఫైనల్లో బంగ్లాదేశ్ లేదా చైనాతో భారత్ పోటీ పడుతుంది.
మరో క్వార్టర్ ఫైనల్లో పాకిస్థాన్ జట్టు థాయ్లాండ్తో తలపడనుంది.
మహిళల జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా కొనసాగనున్నారు.
మొత్తంగా రెండు విభాగాల్లోనూ పటిష్ఠమైన జట్లతో బరిలోకి దిగుతున్న భారత్.. మరోసారి స్వర్ణ పతకాలే లక్ష్యంగా ఆసియా క్రీడల బరిలోకి దిగనుంది.