Loading...
Axar Patel: అక్షర్ పటేల్ సూపర్ ఇన్నింగ్స్‌.. సచిన్‌, హార్దిక్ సరసన అరుదైన రికార్డు!
అక్షర్ పటేల్ సూపర్ ఇన్నింగ్స్‌.. సచిన్‌, హార్దిక్ సరసన అరుదైన రికార్డు!

Axar Patel: అక్షర్ పటేల్ సూపర్ ఇన్నింగ్స్‌.. సచిన్‌, హార్దిక్ సరసన అరుదైన రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2026
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

యూకే పర్యటనలో టీమ్‌ఇండియా ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. వరుసగా ఆరు టీ20 మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్న భారత జట్టు, తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను ఓడించి టూర్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో సమష్టిగా రాణించిన భారత్‌ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. నాలుగు వికెట్లు పడగొట్టడంతో పాటు అజేయంగా 57 పరుగులు చేసిన అక్షర్‌ పటేల్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌తో అక్షర్‌ పటేల్‌ తన ఖాతాలో అరుదైన రికార్డును కూడా నమోదు చేసుకున్నాడు.

వివరాలు

1998లో ఆస్ట్రేలియా గడ్డపై సచిన్ నమోదు

విదేశీ గడ్డపై ఒకే వన్డే మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి, 50కిపైగా పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు.

ఇంతకుముందు ఈ ఘనతను కేవలం సచిన్‌ టెండూల్కర్‌, హార్దిక్‌ పాండ్య మాత్రమే సాధించారు. 1998లో ఆస్ట్రేలియాపై సచిన్‌ టెండూల్కర్‌ 141 పరుగులు చేసి, బౌలింగ్‌లో 4/38 గణాంకాలు నమోదు చేశాడు.

ఆ తర్వాత 24 ఏళ్లకు హార్దిక్‌ పాండ్య 2022లో ఇంగ్లాండ్‌పై 71 పరుగులు చేయడంతో పాటు 4/24 బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

ఇప్పుడు అక్షర్‌ పటేల్‌ కూడా వారి సరసన చేరాడు.

వివరాలు

స్వదేశంలోనూ ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్లు

స్వదేశంలో జరిగిన వన్డేల్లో కూడా ఈ అరుదైన ఫీట్‌ను ముగ్గురు భారత క్రికెటర్లు నమోదు చేశారు.

2008లో ఇండోర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ 118 పరుగులు చేసి నాలుగు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు.

1988లో విశాఖపట్నం వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ 70 పరుగులు చేయడంతో పాటు 5/27 బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. మరోవైపు సౌరవ్‌ గంగూలీ ఈ ఘనతను రెండు సార్లు అందుకున్నాడు.

1999లో నాగ్‌పూర్‌లో శ్రీలంకపై 130 పరుగులు చేసి 4/21 గణాంకాలు నమోదు చేయగా, 2000లో కాన్పూర్‌లో జింబాబ్వేపై 71 పరుగులు చేసి 5/34 బౌలింగ్‌తో మెరిశాడు.

ADVERTISEMENT

వివరాలు

తొలి వన్డేలో నమోదైన మరో విశేషాలు

2016 తర్వాత విరాట్‌ కోహ్లీ లేదా రోహిత్‌ శర్మలో ఎవరో ఒకరు కనీసం అర్ధశతకం చేయకుండా 250కిపైగా లక్ష్యాన్ని ఛేదించడం టీమ్‌ఇండియాకు ఇది కేవలం రెండోసారి మాత్రమే.

చివరిసారిగా 2022లో ఇంగ్లాండ్‌పైనే భారత్‌ 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో విరాట్‌ (17), రోహిత్‌ (17) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు.

ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో 2015 నుంచి అజేయంగా కొనసాగుతున్న ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్‌లో తొలి పరాజయం ఎదురైంది. అంతకుముందు 2014లో కూడా అదే వేదికపై టీమ్‌ఇండియా చేతిలోనే ఇంగ్లాండ్‌ ఓడిపోయింది.

వన్డేల్లో ఇంగ్లాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా ఆరో విజయం. ఇంగ్లాండ్‌పై వరుసగా ఆరు వన్డేలు గెలవడం భారత జట్టుకు ఇది మూడోసారి కావడం విశేషం.

ADVERTISEMENT