Bangladesh T20 Cup: టీ20 ప్రపంచకప్కు దూరమైన బంగ్లాదేశ్.. కొత్త టీ20 టోర్నమెంట్కు శ్రీకారం
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026కు దూరమైన బంగ్లాదేశ్.. తమ దేశ ఆటగాళ్లకు పోటీ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కొత్త టీ20 టోర్నమెంట్ను ప్రారంభించనుంది. ఈ టోర్నీకి 'ఓడోమ్మో బంగ్లాదేశ్ టీ20 కప్ 2026'(ODOMMO Bangladesh T20 Cup 2026) అని పేరు పెట్టింది. 'ఓడోమ్మో' అనే పదానికి బంగ్లా భాషలో అజేయమైనది, ఎవరికీ లొంగనిది అనే అర్థం ఉంటుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. మొత్తం మూడు జట్లు ఇందులో పోటీపడనున్నాయి. ధూమ్కేతు XI జట్టుకు లిటన్ దాస్ నాయకత్వం వహించనుండగా, దర్బార్ XI జట్టును నజ్ముల్ హుస్సేన్ శాంటో నడిపించనున్నారు. ఇక 'దురంటో XI' జట్టుకు అక్బర్ అలీ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
Details
ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో గ్రూప్ దశ మ్యాచ్లు
ప్రైజ్మనీతో పాటు ఆటగాళ్లకు చెల్లించే మ్యాచ్ ఫీజుల కోసం మొత్తం రూ.1.87 కోట్లను ఖర్చు చేయనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. మ్యాచ్లకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చేందుకు ఈ టోర్నీలో 'ఇంపాక్ట్ ప్లేయర్ రూల్'ను ప్రవేశపెట్టనున్నట్లు బీసీబీ ప్రకటించింది. ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో గ్రూప్ దశ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నెల 9న ఫైనల్ మ్యాచ్ను నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచకప్ 2026 ఈ నెల 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్కు భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్లో మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ప్రత్యామ్నాయ జట్టుగా ఆడించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది.