IPL: ఐపీఎల్ సృష్టికర్త మళ్లీ రంగంలోకి?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ను స్థాపించిన మాజీ చైర్మన్ లలిత్ మోదీ మరోసారి ఈ అత్యంత ధనిక క్రికెట్ లీగ్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈసారి ఆయన పాలక మండలి సభ్యుడిగా కాకుండా, ఒక జట్టు సహ యజమానిగా రంగప్రవేశం చేయాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో భాగస్వామిగా చేరేందుకు మోదీ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు యజమాని మనోజ్ బడాలే తన వాటాను విక్రయించడానికి సిద్ధమయ్యాడని సమాచారం. ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ సంస్థకు అధిపతి అయిన మనోజ్ బడాలే ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్లో సుమారు 65 శాతం వాటాను కలిగి ఉన్నాడు.
వివరాలు
లలిత్ మోదీపై బీసీసీఐ జీవితకాల నిషేధం
మిగిలిన 35 శాతం వాటాలో గెర్రీ కార్డినాల్కు 15 శాతం, లాచ్లాన్ ముర్డోక్కు 13 శాతం ఉండగా, మిగతా వాటాను కల్ సోమాని, టైగర్ గ్లోబల్ వంటి సంస్థలు కలిగి ఉన్నాయి. ఇదిలా ఉండగా లలిత్ మోదీ ఇప్పటికే మైనారిటీ వాటా కలిగిన కల్ సోమానితో కలిసి బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వాటాల విక్రయానికి సంబంధించి మార్చి 16న లండన్లో కీలక చర్చలు జరగనున్నాయి. ఆ సమావేశంలో మోదీ-సోమాని బృందం కూడా పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా లలిత్ మోదీపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే.
వివరాలు
అడ్డంకులు తప్పవా
అలాంటి పరిస్థితుల్లో ఆయన రాజస్థాన్ జట్టును కొనుగోలు చేయాలనుకుంటే ప్రభుత్వం, బీసీసీఐ నుంచి కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ను సొంతం చేసుకోవాలంటే సుమారు రూ.9,200 కోట్ల నుంచి రూ.11,000 కోట్ల వరకు ఖర్చు కావచ్చని అంచనా. అదే సమయంలో ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఇంటర్నెట్ కూడా ఈ జట్టును కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.