LOADING...
Ajit Agarkar: అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం
అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం

Ajit Agarkar: అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Moogati Shabari
Apr 19, 2026
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీసీసీఐ ప్రధాన ఎంపిక కమిటీ అధ్యక్షుడు అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై పలు చర్చలు జరుగుతున్నాయి. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ సంవత్సరం జూన్‌తో అతని పదవీకాలం ముగియాల్సి ఉంది. అయితే మరో ఏడాది వరకు పొడిగించే అవకాశాలపై బీసీసీఐలో చర్చలు సాగుతున్నట్టు సమాచారం. అగార్కర్ బాధ్యతలు చేపట్టిన తరువాత టీమిండియా మూడు ఐసీసీ టైటిళ్లను గెలుచుకోవడం గమనార్హం. టీ20 ప్రపంచ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026లను భారత్ దక్కించుకుంది. అంతేకాకుండా, 2023 వన్డే ప్రపంచ కప్‌లో జట్టు ఫైనల్‌ వరకు చేరింది. ఈ విజయవంతమైన రికార్డును దృష్టిలో పెట్టుకుని, 2027 వన్డే ప్రపంచ కప్ వరకు అగార్కర్ సేవలను కొనసాగించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

వివరాలు

ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు టీమిండియా..

అజిత్ నాయకత్వంలో టీమ్ ఇండియాలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. మార్పుల దశను జట్టు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధిగమించిందని వారు పేర్కొన్నారు. అగార్కర్ ధైర్యంగా కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా పేరుపొందాడు. అందువల్ల అతడిని కొనసాగించే దిశగా బోర్డు ఆసక్తి చూపుతోంది. ఐపీఎల్ సమయంలో ఈ అంశంపై బీసీసీఐ ప్రతినిధులు అతనితో చర్చలు జరిపే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, ప్రస్తుతం సూర్య టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు అతని నాయకత్వంలోనే టీమ్ ఇండియా వెళ్లనుంది. ఈ సిరీస్‌లలో అతను మెరుగైన ప్రదర్శన కనబరిస్తే, 2028 ఒలింపిక్స్, టీ20 ప్రపంచ కప్‌కు కూడా అతడే నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Advertisement