BCCI-Team India: 2027 వరల్డ్ కప్పై బీసీసీఐ ఫోకస్.. గంభీర్, గిల్ ప్లాన్కు గ్రీన్ సిగ్నల్?
ఈ వార్తాకథనం ఏంటి
2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఇప్పటి నుంచే సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. మెగా టోర్నీ ప్రధానంగా దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న నేపథ్యంలో.. అక్కడి పిచ్లు, వాతావరణం, పరిస్థితులకు భారత ఆటగాళ్లు ముందుగానే అలవాటు పడేలా టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాతో ప్రత్యేకంగా వన్డే సిరీస్ నిర్వహించే అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ సౌతాఫ్రికాతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా, గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి నుంచి వచ్చిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకే బీసీసీఐ.. క్రికెట్ సౌతాఫ్రికాతో చర్చలు ప్రారంభించినట్లు ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది
వివరాలు
ఆరు వన్డేలు నిర్వహించే అవకాశం
. 2027 ప్రపంచ కప్కు ముందు దక్షిణాఫ్రికా గడ్డపైనే భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ నిర్వహించాలన్నది ఈ ప్రతిపాదనగా తెలుస్తోంది.
ఈ సిరీస్లో నాలుగు నుంచి ఆరు వన్డేలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్ 2027 ముగిసిన తర్వాత భారత జట్టు పర్యటనలను బీసీసీఐ ఇంకా పూర్తిగా ఖరారు చేయలేదు.
దీంతో ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ)లో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు అవసరమైన సమయాన్ని కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రపంచ కప్ జరగనున్న దేశంలోనే ముందుగా వన్డేలు ఆడటం ద్వారా భారత ఆటగాళ్లకు అక్కడి పరిస్థితులపై మెరుగైన అవగాహన ఏర్పడుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
ఆటగాళ్ల ఫిట్నెస్పైనా ప్రత్యేక దృష్టి
ముఖ్యంగా దక్షిణాఫ్రికా పిచ్ల స్వభావం, వాతావరణ పరిస్థితులు, అక్కడి ఆటకు అనుగుణంగా తమ వ్యూహాలను ముందుగానే పరీక్షించుకునే అవకాశం టీమిండియాకు లభించనుంది.
ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా భారత జట్టు ఆటగాళ్ల ఫిట్నెస్పై కూడా టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.
2027 ప్రపంచ కప్ సమయానికి ప్రతి ఆటగాడు పూర్తి ఫిట్నెస్తో అందుబాటులో ఉండేలా ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
భారత జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లే రూక్స్ ఇప్పటికే ఆటగాళ్ల కోసం ప్రత్యేక ఫిట్నెస్ ప్రోగ్రామ్ను రూపొందించినట్లు సమాచారం.
ఈ ప్రణాళికపై ఆటగాళ్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కెప్టెన్ శుభ్మన్ గిల్ను కూడా బీసీసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
వివరాలు
బుమ్రా, హార్దిక్పై ప్రత్యేక ఫోకస్
ఆటగాళ్ల దృక్కోణాన్ని గిల్ ద్వారా తెలుసుకోవడంతో పాటు.. టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ, సపోర్ట్ స్టాఫ్ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.
ప్రపంచ కప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీకి ముందు ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే దీని ఉద్దేశంగా తెలుస్తోంది.
ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.
వీరిద్దరూ భారత జట్టులో కీలక ఆటగాళ్లు కావడంతో.. 2027ప్రపంచ కప్ సమయానికి వారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది.
బుమ్రా, హార్దిక్ల విషయంలో వర్క్లోడ్, ఫిట్నెస్ మేనేజ్మెంట్కు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
పక్కా ప్రణాళికతో ముందుకు
సుదీర్ఘ క్రికెట్ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లపై అధిక భారం పడకుండా చూసుకుంటూ.. అదే సమయంలో ప్రపంచ కప్ నాటికి వారు అత్యుత్తమ ఫిట్నెస్తో ఉండేలా ప్రణాళికను అమలు చేయాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.
మొత్తంగా 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ కప్ జరిగే దక్షిణాఫ్రికా గడ్డపై ముందుగానే ప్రత్యేక వన్డే సిరీస్ ఆడటంతో పాటు.. ఆటగాళ్ల ఫిట్నెస్, వర్క్లోడ్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టడం ద్వారా మెగా టోర్నీకి పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని భారత జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది.