BCCI: భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ను (ICC Women's ODI World Cup) తొలిసారిగా కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచ చాంపియన్గా నిలిచింది. అయితే, ఈ చారిత్రాత్మక విజయానంతరం అభిమానులు ఎదురుచూస్తున్న విజయోత్సవ ర్యాలీ త్వరలో జరగే అవకాశాలు లేవని బీసీసీఐ (BCCI) సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలిపారు. నవంబర్ 4 నుంచి 7 వరకు దుబాయ్లో ఐసీసీ (ICC) సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత సీనియర్ అధికారులు భారత్ తిరిగి వచ్చిన అనంతరం మాత్రమే విజయోత్సవ వేడుకపై నిర్ణయం తీసుకునే అవకాశముందని ఆయన వెల్లడించారు.
Details
ఆసియా కప్ ట్రోఫీ ఇంకా అందలేదు
ప్రస్తుతం విజయోత్సవ ర్యాలీకి ఎలాంటి ప్రణాళికలు లేవు. నేను ఐసీసీ సమావేశాల కోసం దుబాయ్ వెళ్తున్నాను. మా బోర్డు నుండి మరికొంత మంది అధికారులు కూడా అక్కడికి వెళ్తున్నారు. మేమంతా తిరిగి వచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని దేవ్జిత్ సైకియా ముంబయి విమానాశ్రయంలో మీడియాతో అన్నారు. అలాగే ఆసియా కప్ (Asia Cup) ట్రోఫీ భారత్కు ఇంకా రాకపోవడంపై కూడా ఆయన స్పందించారు. "ఆసియా కప్ ట్రోఫీ విషయం ఐసీసీ దృష్టికి తీసుకెళ్తాం. ట్రోఫీని గౌరవప్రదమైన మార్గంలో తిరిగి తెచ్చుకునే నమ్మకంతో ఉన్నామని సైకియా స్పష్టం చేశారు.
Details
లేఖ పంపినా ఇంకా సమస్య పరిష్కారం కాలేదు
ఇక పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ మ్యాచ్లలో భారత ఆటగాళ్లు పాక్ క్రికెటర్లతో కరచాలనం చేయడాన్ని నివారించారు. ఆ టోర్నమెంట్ ఫైనల్లో టీమ్ఇండియా పాకిస్థాన్ను చిత్తు చేసి చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్ నఖ్వీ నుంచి ట్రోఫీ స్వీకరించడానికి భారత ఆటగాళ్లు నిరాకరించడంతో కొత్త వివాదం చెలరేగింది. నఖ్వీ, మరెవరినీ పంపకుండా ట్రోఫీ, మెడళ్లను తనతోపాటు తీసుకెళ్లిపోవడంతో ఆ ట్రోఫీ భారత్కు ఇంకా అందలేదు. ఈ విషయమై బీసీసీఐ ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్కు లేఖ పంపినా సమస్య ఇంకా పరిష్కారం కాలేదు.