World Cup 2027: ఐపీఎల్ 2026 ముందు బీసీసీఐ సీక్రెట్ ప్లాన్.. వన్డే వరల్డ్ కప్ కోసం జట్టు సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
ఒకవైపు ఐపీఎల్ 2026 సీజన్కు రంగం సిద్ధమవుతోంది. ఇంకా కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ లీగ్ పూర్తయ్యే వరకు భారత ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్లకు దూరంగా ఉండనున్నారు. ఇదే సమయంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం నిశ్శబ్దంగా పెద్ద లక్ష్యానికి జట్టును రెడీ చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే సుమారు 20 మంది ఆటగాళ్లతో ప్రాబబుల్స్ జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్రణాళిక అంతా వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని సాగుతున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్లలో ఈ ఆటగాళ్ల ప్రదర్శనను సెలక్టర్లు దగ్గరుండి గమనించనున్నారు.
వివరాలు
పేసర్ హర్షిత్ రాణా గాయంతో టోర్నీకి దూరం
సెలక్షన్ కమిటీ విధానం కూడా స్పష్టంగా నిర్ణయించారు.ప్రతిసెలక్టర్ వారానికి కనీసం ఒక మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించాలి. ఇలా మొత్తం కలిసి వారానికి ఐదుమ్యాచ్లను పరిశీలించే అవకాశం ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్లను పరిశీలించడం అంటే రాబోయే లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ లేదా టీ20 ప్రపంచ కప్ 2028 కోసం కొత్త ప్రతిభను వెతకడం కాదని తెలుస్తోంది. అలాగే వన్డే వరల్డ్ కప్ కోసం కొత్త స్టార్లను కనుగొనే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇప్పటికే ఉన్న ఆటగాళ్ల ప్రదర్శనను అంచనా వేయడమే ప్రధానలక్ష్యం. ఇప్పటికే పేసర్ హర్షిత్ రాణా గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. ఇక మిగిలిన ప్రధాన బౌలర్లైన జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ధ్ కృష్ణ,అర్ష్దీప్ సింగ్,హార్దిక్ పాండ్య ప్రదర్శనపై సెలక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు.
వివరాలు
అఫ్గానిస్థాన్ టెస్టుకు సీనియర్లే సిద్ధం
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్ అఫ్గానిస్థాన్తో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇది వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో భాగం కాకపోయినా, టీమ్ ఇండియాలోని సీనియర్ ఆటగాళ్లు అందరూ ఈ మ్యాచ్లో పాల్గొనే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది. డబ్ల్యూటీసీ నాలుగో సీజన్లో భారత్ మొత్తం తొమ్మిది టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో బుమ్రా, సిరాజ్ వంటి ప్రధాన పేసర్లతో పాటు ఇతర బౌలర్లకూ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టెస్టు ఫార్మాట్ను ప్రయోగాల వేదికగా మార్చాలనే ఉద్దేశం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. కొత్త ఆటగాళ్లను పరీక్షించడానికి ఇండియా-A టూర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అందుకే ప్రతి టెస్టులోనూ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలకు అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు యోచిస్తున్నారు.
వివరాలు
అజిత్ అగార్కర్ పదవీకాలంపై స్పష్టత
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకు పొడిగించాలని కోరినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, అలాంటి ప్రతిపాదన తమ వద్దకు రాలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. అజిత్ అగార్కర్ ప్రస్తుత పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆయన భవిష్యత్తుపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాతో కలిసి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.