Ruturaj Gaikwad: మరోసారి నిబంధనల ఉల్లంఘన.. రుతురాజ్ గైక్వాడ్పై కఠినంగా వ్యవహరించిన బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నైసూపర్ కింగ్స్లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గురువారం రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో సీఎస్కే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయాల్లో ఒకటిని చవిచూసింది. 89 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించగా, ఈ సీజన్లో తమ తొమ్మిదో విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో టాప్-2లో స్థానం దక్కించుకుంది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి బయటపడ్డ చెన్నై జట్టుకు ఇప్పుడు బీసీసీఐ నుంచి కూడా షాక్ ఎదురైంది. స్లో ఓవర్ రేట్ కారణంగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి మరోసారి చర్యలు తీసుకుంది.
వివరాలు
నిబంధలను ఉల్లంఘించడం ఇది రెండోసారి
ఈ సీజన్లో సీఎస్కే ఓవర్ రేట్ నిబంధనలు ఉల్లంఘించడం ఇది రెండోసారి కావడంతో గైక్వాడ్కు రూ.24 లక్షల జరిమానా విధించారు. అంతేకాకుండా ఇంపాక్ట్ ప్లేయర్ కార్తిక్ శర్మతో పాటు జట్టులోని మిగతా సభ్యులకు రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం — ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని జరిమానాగా విధించారు. ఈ సీజన్లో సీఎస్కేపై స్లో ఓవర్ రేట్ కారణంగా ఇది రెండో చర్య. తొలి ఉల్లంఘన ఏప్రిల్ 12న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో నమోదైంది. అప్పట్లో రుతురాజ్కు రూ.12 లక్షల జరిమానా విధించారు.
వివరాలు
సీఎస్కే ప్రదర్శనతో అభిమానులకు నిరాశ
అయితే సీజన్ ముగియకముందే మరోసారి అదే తప్పిదం పునరావృతం కావడంతో ఈసారి జరిమానా మొత్తాన్ని రెట్టింపు చేసి రూ.24 లక్షలకు పెంచింది బీసీసీఐ. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం మొదటి ఉల్లంఘనకు రూ.12 లక్షలు, రెండోసారి రూ.24 లక్షలు జరిమానా విధిస్తారు. మూడోసారి కూడా ఇదే తప్పు జరిగితే రూ.30 లక్షల జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్లు, సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే జరిమానా మొత్తం రూ.25 లక్షలు దాటితే ఆటోమేటిక్గా డీమెరిట్ పాయింట్ కూడా నమోదవుతుంది. ఈ సీజన్ మొత్తం సీఎస్కే ప్రదర్శన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
వివరాలు
వచ్చే సీజన్లో మరింత బలంగా వస్తాం
రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో జట్టు ప్లేఆఫ్లకు చేరుకోలేకపోయింది. పలు మ్యాచ్లలో నెమ్మదైన బ్యాటింగ్, బలహీనమైన ఫీల్డింగ్, స్లో ఓవర్ రేట్ సమస్యలు జట్టుకు ప్రతికూలంగా మారాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఓటమి తర్వాత సీఎస్కే ప్లేఆఫ్ ఆశలు పూర్తిగా ముగిశాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రుతురాజ్ గైక్వాడ్, "తదుపరి సీజన్లో మేము మరింత బలమైన జట్టుగా తిరిగి వస్తాం" అని వ్యాఖ్యానించాడు. అయినప్పటికీ, కెప్టెన్గా అతని వ్యూహాలు, జట్టు క్రమశిక్షణపై విమర్శలు మాత్రం కొనసాగుతున్నాయి.