LOADING...
IND vs ENG: బెతెల్‌ బ్లాస్టింగ్‌ ఇన్నింగ్స్‌.. భారత్‌పై ఇంగ్లాండ్‌ ఘన విజయం
బెతెల్‌ బ్లాస్టింగ్‌ ఇన్నింగ్స్‌.. భారత్‌పై ఇంగ్లాండ్‌ ఘన విజయం

IND vs ENG: బెతెల్‌ బ్లాస్టింగ్‌ ఇన్నింగ్స్‌.. భారత్‌పై ఇంగ్లాండ్‌ ఘన విజయం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 05, 2026
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 జట్టుకు కెప్టెన్‌గా తొలి విజయాన్ని నమోదు చేయాలన్న శ్రేయస్‌ అయ్యర్‌ ఆశ మరోసారి నెరవేరలేదు. జాకబ్‌ బెతెల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ను అడ్డుకోలేకపోయిన భారత్‌.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో భారీ స్కోరు నమోదు చేయలేకపోయిన భారత జట్టు, బౌలింగ్‌లోనూ చివరి దశలో ఒత్తిడిని కొనసాగించలేకపోయింది. ఛేదనలో ఒక దశ వరకు మ్యాచ్‌పై భారత్‌ పట్టు సాధించినట్లే కనిపించినా, కీలక సమయంలో బెతెల్‌ ఆడిన దూకుడు ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.

వివరాలు

ఆధిక్యంలో ఇంగ్లండ్ జట్టు..

ఇషాన్‌ కిషన్‌ 49, అభిషేక్‌ శర్మ 43, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 37 పరుగులతో జట్టుకు ప్రధాన ఆధారంగా నిలిచారు. ఇంగ్లాండ్‌ తరఫున సామ్‌ కరన్‌ మూడు వికెట్లు తీసి భారత పరుగుల వేగాన్ని నియంత్రించాడు. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు జాకబ్‌ బెతెల్‌ అజేయంగా 76 పరుగులు చేసి విజయానికి బాటలు వేశాడు. అతనికి హ్యారీ బ్రూక్‌ 39, టామ్‌ బాంటన్‌ 39 పరుగులతో మంచి సహకారం అందించారు. ఫలితంగా ఇంగ్లాండ్‌ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 1-0 ఆధిక్యం సాధించింది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా, మూడో టీ20 మంగళవారం జరగనుంది.

వివరాలు

బెతెల్‌ దాడితో మ్యాచ్‌ మలుపు..

15.2 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఇంగ్లాండ్‌ స్కోరు 133/5. అప్పటికి గెలుపు కోసం ఇంకా 28 బంతుల్లో 58 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో మ్యాచ్‌పై భారత్‌కే పైచేయి కనిపించింది. అయితే అప్పటివరకు నెమ్మదిగా ఆడిన బెతెల్‌ ఒక్కసారిగా తన గేర్‌ మార్చి భారత ఆశలపై నీళ్లు చల్లాడు. భారత బౌలర్లు ఆరంభంలోనే మెరుగైన ప్రదర్శన చేశారు. తొలి ఓవర్లో అర్ష్‌దీప్‌ సింగ్‌ వరుసగా ఫిల్‌ సాల్ట్‌, జోస్‌ బట్లర్‌లను ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌కు గట్టి దెబ్బ తీశాడు. అయినప్పటికీ మరోవైపు హ్యారీ బ్రూక్‌ దూకుడుగా ఆడి వరుస బౌండరీలు, సిక్సర్లతో స్కోరును వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. ఐదో ఓవర్లో అక్షర్‌ పటేల్‌ అతడిని వెనక్కి పంపాడు.

Advertisement

వివరాలు

విజయతీరాలకు చేర్చిన బెతెల్..

తర్వాత బెతెల్‌, బాంటన్‌ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. భారత బౌలర్లు పరుగుల వేగాన్ని కొంతవరకు నియంత్రించినా, 12 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 118/3తో బలమైన స్థితిలో నిలిచింది. అనంతరం అర్ష్‌దీప్‌ బాంటన్‌ను, వరుణ్‌ చక్రవర్తి విల్‌ జాక్స్‌ను ఔట్‌ చేయడంతో భారత్‌కు మరోసారి విజయావకాశాలు మెరుగయ్యాయి. అయితే తొలి 34 బంతుల్లో కేవలం 38 పరుగులే చేసిన బెతెల్‌ చివరి దశలో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా బిష్ణోయ్‌ వేసిన 17వ ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. అదే మ్యాచ్‌కు కీలక మలుపుగా నిలిచింది. దీంతో లక్ష్యం సులభమైంది. 18వ ఓవర్లో సామ్‌ కరన్‌ ఔటైనా, జోఫ్రా ఆర్చర్‌తో కలిసి బెతెల్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Advertisement

వివరాలు

అభిషేక్‌ మెరుపులు... కానీ భారత్‌కు తక్కువ స్కోరే

భారత్‌ 190 పరుగులు చేసినప్పటికీ, ఇంగ్లాండ్‌లాంటి బలమైన బ్యాటింగ్‌ జట్టుపై అది సరిపడా స్కోరు కాలేదు. భారత బ్యాటర్లలో ఎవరూ పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించలేకపోయారు. టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఇషాన్‌ కిషన్‌ కూడా ఆశించిన వేగంతో పరుగులు చేయలేకపోయాడు. మబ్బులతో కూడిన వాతావరణంలో టాస్‌ గెలిచిన భారత్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. అదనపు బౌన్స్‌ను ఉపయోగించుకున్న జోఫ్రా ఆర్చర్‌, జోష్‌ టంగ్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. అయినప్పటికీ మూడో ఓవర్‌ నుంచి భారత బ్యాటర్లు బౌండరీలు సాధించడం ప్రారంభించారు. అభిషేక్‌ శర్మతో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ రెండు సిక్సర్లతో తన ప్రతిభను చాటాడు.

వివరాలు

ఇన్నింగ్స్ సాగిందిలా..

అయితే ఐదో ఓవర్లో స్పిన్నర్‌ విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు అభిషేక్‌ ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో వేగంగా ఆడినా, తదుపరి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన అనంతరం ఔటయ్యాడు. అప్పటికి భారత్‌ స్కోరు 65/2గా ఉంది. 18 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ 162/5తో నిలిచింది. అనంతరం అక్షర్‌ పటేల్‌ రెండు పరుగులకే ఔటయ్యాడు. చివరి ఓవర్లో తిలక్‌ వర్మ తన శైలిలో మెరిశాడు. తిలక్‌ 11 బంతుల్లో అజేయంగా 24 పరుగులు చేయడంతో భారత్‌ స్కోరు 190కు చేరుకుంది. చివరి బంతికి హర్షిత్‌ రాణా ఔటయ్యాడు.

Advertisement