Team India: టీమిండియాలో భారీ మార్పులు.. సూర్య స్థానంలో శ్రేయస్కు కెప్టెన్సీ?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా టీ20 కెప్టెన్గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా పేలవ ప్రదర్శనలు చేస్తుండటంతో అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని సెలక్షన్ కమిటీ ఆలోచిస్తోంది. సూర్యకుమార్ ఫామ్లోకి వస్తాడని ఎదురుచూస్తున్నప్పటికీ, అతని ఆటతీరులో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026లో కెప్టెన్గా, బ్యాటర్గా అద్భుత ప్రదర్శన చేస్తున్న శ్రేయస్ అయ్యర్ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకుని సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. జూన్ చివర్లో భారత జట్టు రెండు టీ20 మ్యాచ్ల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అనంతరం జులై 1 నుంచి ఇంగ్లాండ్తో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది.
వివరాలు
త్వరలోనే అధికారిక ప్రకటన
ఐపీఎల్ ముగిసిన తర్వాత సెలక్షన్ కమిటీ సమావేశమై కొత్త జట్టును ప్రకటించనుండగా, అప్పుడే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా వన్డేలు, టీ20లకు ఒకే కెప్టెన్ ఉండే విధంగా బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్కు రెండు ఫార్మాట్ల బాధ్యతలు అప్పగించే అవకాశాలూ ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. కొత్త టీ20 జట్టును ప్రకటించే సమయంలో కొన్ని కీలక మార్పులు ఉండొచ్చు. టీ20లు, వన్డేలకు ఒకే కెప్టెన్ ఉండే దిశగా మేము ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం మా ప్రధాన దృష్టి ఈ రెండు ఫార్మాట్లపైనే ఉంది. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంతో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం.
వివరాలు
బ్యాటర్ గా విఫలమవుతున్న సూర్యకుమార్
కొన్నేళ్లుగా శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అయితే గాయాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. ప్రస్తుతం ఐపీఎల్లో తన జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. వైట్బాల్ కెప్టెన్సీకి అతడే ప్రధాన పోటీదారని పేర్కొన్నట్లు సమాచారం. అయితే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోనే భారత జట్టు 2026 టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్గా మంచి రికార్డు ఉన్నప్పటికీ, బ్యాటర్గా విఫలమవుతుండటం ఇప్పుడు అతనికి మైనస్గా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో సూర్యకుమార్ 10మ్యాచ్లు ఆడి కేవలం 195 పరుగులే చేశాడు. పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా ఉన్న శ్రేయస్ అయ్యర్ 9 ఇన్నింగ్స్ల్లో 333పరుగులు నమోదు చేశాడు. అతని సారథ్యంలో పంజాబ్ జట్టు తొలి ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధించి అద్భుత ఫామ్లో కొనసాగుతోంది.