LOADING...
MS Dhoni: సీఎస్కే యాజమాన్యం క్లారిటీ.. వచ్చే ఐపీఎల్‌లో ధోనీ ఆడతారు!
సీఎస్కే యాజమాన్యం క్లారిటీ.. వచ్చే ఐపీఎల్‌లో ధోనీ ఆడతారు!

MS Dhoni: సీఎస్కే యాజమాన్యం క్లారిటీ.. వచ్చే ఐపీఎల్‌లో ధోనీ ఆడతారు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2025
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్‌, ఐపీఎల్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) జట్టు ప్రధాన ఆటగాడు ఎంఎస్ ధోని (MS Dhoni) 2026 ఐపీఎల్‌ సీజన్‌లో ఆడతారా లేదా అన్నది గత కొంతకాలంగా క్రికెట్‌ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. గత రెండు సీజన్లుగా ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపించినా, ఆయన ప్రతిసారి బరిలోకి దిగుతూ అభిమానులను ఉత్సాహపరిచారు. అయితే, ఈసారి ధోనీ భవిష్యత్తు గురించి స్పష్టత వచ్చింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ అందింది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్‌ 2026 టోర్నీలో ధోనీ ఆడబోతున్నారని, ఆయన తుది జట్టులో ఉంటారని సీఎస్కే జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ అధికారికంగా ధృవీకరించారు. దీంతో ధోనీ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు ముగింపు లభించింది.

Details

ఇప్పుడే రిటైర్ కావడం లేదు

కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ ధోనీ ఐపీఎల్‌ 2026లో ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే మాతో చెప్పాడు. ఆయన నిర్ణయం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ధోనీ అనుభవం యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆయన ఇప్పుడే రిటైర్‌ అవ్వడం లేదు... అతడి ఆట ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఇక వచ్చే వారం జరగబోయే సీఎస్కే జట్టు సమావేశంలో కూడా ధోనీ పాల్గొననున్నట్లు విశ్వనాథన్ తెలిపారు. ఆ సమావేశంలో ఆటగాళ్ల మార్పిడి, రిటెన్షన్‌, జట్టు వ్యూహాలపై చర్చ జరగనుంది.

Details

సీఎస్కే కెప్టెన్సీపై చర్చ

గత ఐపీఎల్‌ సీజన్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయంతో ధోనీ జట్టును నడిపించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2026లో కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారన్న ప్రశ్న ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. రుతురాజ్‌ గైక్వాడ్‌కే పగ్గాలు అప్పగిస్తారా, లేక ధోనీ మళ్లీ కెప్టెన్సీ చేస్తారా, లేదా కొత్త ఆటగాడికి అవకాశం ఇస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. అదే సమయంలో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ sసీఎస్కే జట్టులో చేరే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో సంజూ రాజస్థాన్‌ జట్టును వీడతారని వార్తలు వచ్చాయి. రిటెన్షన్‌ గడువు నవంబర్‌ 15తో ముగియనుండడంతో ఈ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది.

Details

ఈనెల 10, 11 తేదీల్లో సీఎస్కే మేనేజ్‌మెంట్‌ సమావేశం

ఒకవేళ సంజూ సీఎస్కేలో చేరితే, అతనికి కెప్టెన్సీ అప్పగిస్తారా లేదా రుతురాజ్‌నే కొనసాగిస్తారా అన్నది త్వరలో స్పష్టత రానుంది. ఈనెల 10, 11 తేదీల్లో సీఎస్కే మేనేజ్‌మెంట్‌ సమావేశం జరుగనుందని, ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ధోనీ గణాంకాలు ఇవే చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున మహేంద్ర సింగ్‌ ధోనీ ఇప్పటివరకు 248 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి, 4,865 పరుగులు సాధించాడు. తన కెప్టెన్సీలో సీఎస్కే జట్టుకు ఐదు టైటిళ్లు అందించాడు. మొత్తానికి, ధోనీ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పడగా, సీఎస్కే అభిమానులకు మళ్లీ ధోనీని యాక్షన్‌లో చూసే అవకాశం దక్కబోతోంది.