IPL 2026: పంజాబ్పై ఢిల్లీ థ్రిల్లింగ్ విజయం..
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన 55వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు పంజాబ్ కింగ్స్ (PBKS)పై 3 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 5 వికెట్లకు 210పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య 56పరుగులతో దూకుడుగా ఆడగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 59పరుగులతో అజేయంగా నిలిచాడు. చివర్లో కూపర్ కోనొల్లి 38,సూర్యాంశ్ షెడ్గే 29 పరుగులతో వేగంగా ఆడారు. 211పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అభిషేక్ పోరెల్ (5), కేఎల్ రాహుల్ (9) త్వరగా ఔటయ్యారు.ఈ దశలో కెప్టెన్ అక్షర్ పటేల్ బాధ్యతాయుతంగా ఆడి 30 బంతుల్లో 56 పరుగులు చేశాడు.
వివరాలు
51 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్
మరోవైపు డేవిడ్ మిల్లర్ 28 బంతుల్లో 51 పరుగులతో మెరిపించాడు. చివర్లో ఆశుతోష్ శర్మ 24 పరుగులు చేయగా, మాధవ్ తివారీ 18 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఢిల్లీ జట్టు 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్లో తన ఐదో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్ తొలి బంతినే సిక్సర్గా మలిచిన అతడు 24 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. ప్రభ్సిమ్రన్ సింగ్తో కలిసి తొలి వికెట్కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 33 బంతుల్లో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుత ఫామ్ను కొనసాగించాడు.
వివరాలు
ఢిల్లీపై వరుసగా మూడోసారి 50కిపైగా స్కోరు చేసిన అయ్యర్
ఐపీఎల్ కెరీర్లో తన 32వ అర్ధ సెంచరీ సాధించిన అతడు 36 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ సీజన్లో ఇది అతడి ఐదో ఫిఫ్టీ కావడం విశేషం. ఢిల్లీపై వరుసగా మూడోసారి 50కిపైగా స్కోరు చేసిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. అంతకుముందు రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించారు. అక్షర్ పటేల్ తన ఐపీఎల్ కెరీర్లో నాలుగో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఈ సీజన్లో అతడికి ఇదే తొలి ఫిఫ్టీ. మిల్లర్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. ఇక మిల్లర్ ఐపీఎల్లో తన 14వ అర్ధసెంచరీ సాధించాడు. ధర్మశాల మైదానంలో మరోసారి అతడు తన ప్రత్యేక శైలిలో మెరిపించాడు.