Deepti Sharma: హాఫ్ సెంచరీతో పాటు మూడు వికెట్లు.. తొలి భారత మహిళా క్రికెటర్గా దీప్తి శర్మ రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) చరిత్రలో నిలిచే రికార్డు సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్లో టీమిండియా విజయవంతమైన ఆరంభం చేసింది. శ్రీలంకపై భారత్ 59 పరుగుల తేడాతో (డక్వర్త్-లూయిస్ పద్ధతి) గెలుపొందగా, ఆ విజయానికి దీప్తి ప్రధాన కారణమైంది. హాఫ్ సెంచరీతో పాటు మూడు వికెట్లు తీయడం ద్వారా వరల్డ్కప్ వేదికపై ఇలాంటి ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్గా రికార్డులు బద్దలు కొట్టింది. వన్డేల్లో ఇలా రెండోసారి ఈ అరుదైన ఘనత నమోదు చేయడం విశేషం. మొదట బ్యాటింగ్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పటికీ దీప్తి ఆత్మవిశ్వాసంగా ఆడింది. 53 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోరు అందించింది.
Details
దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
ఆమెతోపాటు అమన్ కౌర్(57)అద్భుత ఇన్నింగ్స్ ఆడి, భారత్ 269 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆ తర్వాత 270 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకపై బౌలింగ్లో దీప్తి ప్రభావం చూపింది. లంక కెప్టెన్ చమరి ఆటపట్టు(43)ను బౌల్డ్ చేసి కీలక బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మరో రెండు వికెట్లు తీసి లంక ఇన్నింగ్స్ను కూలదోసింది. దీంతో టీమ్ఇండియాకు విజయం అందించి "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాకుండా వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం దీప్తి ఖాతాలో 143 వికెట్లు ఉన్నాయి. ఈ క్రమంలో స్టార్ పేసర్ జులన్ గోస్వామి (255 వికెట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది.