IPL 2026: పంత్ ఫెయిల్.. అయినా లక్నో వదలలేదు.. గొయెంకా హాట్ కామెంట్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2024 ముగిసిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ను వదులుకుంది. అనంతరం 2025 సీజన్కు ముందు జరిగిన వేలంలో టీమిండియా వికెట్కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ను భారీగా రూ.27 కోట్లకు దక్కించుకుంది. ఆ వెంటనే అతడిని జట్టు కెప్టెన్గా నియమించింది. పంత్ నాయకత్వంలో జట్టు అద్భుతంగా రాణిస్తుందని అందరూ ఆశించారు. కానీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఐపీఎల్ 2025లో లక్నో జట్టు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడిన జట్టు కేవలం 6 మ్యాచ్ల్లోనే గెలిచి, మిగతా 8 మ్యాచ్ల్లో ఓడిపోయింది. మొత్తం 12 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో నిలిచి సీజన్ను ముగించింది.
వివరాలు
పంత్ను వదిలేస్తారనే ప్రచారం
కెప్టెన్గా మాత్రమే కాకుండా బ్యాట్స్మన్గా కూడా పంత్ నిరాశపరిచాడు. ఒక మ్యాచ్లో సెంచరీ సాధించినప్పటికీ, మొత్తం సీజన్ ప్రదర్శన పరంగా చూసుకుంటే అతడు ప్రభావం చూపలేకపోయాడు. 14 మ్యాచ్ల్లో 24.45 సగటు, 133.17 స్ట్రైక్రేట్తో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. జట్టు ప్రదర్శనతో పాటు పంత్ వ్యక్తిగత ఆటతీరు చూసి, ఐపీఎల్ 2025 ముగిసిన వెంటనే అతడిని లక్నో వదిలించుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ, 2026 మినీ వేలానికి ముందు లక్నో జట్టు అతడిని కంటిన్యూ చేసింది.
వివరాలు
క్లారిటీ ఇచ్చిన గొయెంకా
ఈ అంశంపై లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా స్పందిస్తూ పంత్ను జట్టు నుంచి తొలగించే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశాడు. జట్టులో నలుగురు బౌలర్లు సరిగా ఆడకపోతే కెప్టెన్ ఏం చేయగలడని ప్రశ్నించాడు. జట్టులో అందుబాటులో ఉన్న వనరులను బట్టి నాయకుడిని అంచనా వేయాలని ఆయన పేర్కొన్నాడు. పంత్పై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పాడు. కొంతమంది సోషల్ మీడియా వేదికల్లో పంత్ను జట్టులోంచి తప్పిస్తారనే వార్తలు ప్రచారం కావడాన్ని చూసి తాను నవ్వుకున్నానని వ్యాఖ్యానించాడు. వ్యూస్ కోసం ఇలాంటి ప్రచారాలు జరుగుతాయని కూడా పేర్కొన్నాడు. జట్టు కోసం పూర్తిగా శ్రమిస్తున్నప్పుడు, అతనిపై మరింత ఒత్తిడి పెట్టడం సరైనది కాదని అభిప్రాయపడ్డాడు.