BCCI : దేశీయ క్రికెట్ తప్పనిసరి.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. 2027 వన్డే ప్రపంచకప్లో ఈ ఇద్దరు దిగ్గజాలు ఆడతారా లేదా అనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో జాతీయ జట్టులో ఎంపిక కావాలంటే దేశీయ క్రికెట్లో పాల్గొనడం తప్పనిసరి అని బీసీసీఐ (BCCI) ఇప్పటికే ఈ ఇద్దరికీ సూచించినట్లు సమాచారం. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం ప్రకారం - విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని ముంబై క్రికెట్ అసోసియేషన్కు రోహిత్ శర్మ ఇప్పటికే తెలియజేశాడు. అయితే, దేశీయ క్రికెట్ ఆడే అంశంపై విరాట్ కోహ్లీ ఇప్పటికీ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు.
Details
విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభం
టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రోహిత్-కోహ్లీ ద్వయం ప్రస్తుతం వన్డే ఫార్మాట్పైనే దృష్టి సారించింది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ అద్భుత ఫామ్లో కనిపించాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టుతో జరగబోయే వన్డే సిరీస్కు సన్నద్ధమవుతున్నాడు. ఇందుకోసం ముంబైలోని శరద్ పవార్ ఇండోర్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రాబోయే సిరీస్లోనూ తన సత్తా చాటాలన్న సంకల్పంతో ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్లో నివాసముంటున్నాడు. ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం భారతదేశానికి చేరుకోనున్నాడు. మరోవైపు, విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ చివరిసారి ఈ టోర్నీలో 2018లో పాల్గొన్నాడు.
Details
దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ షెడ్యూల్
తొలి వన్డే - నవంబర్ 30 - రాంచీ రెండో వన్డే - డిసెంబర్ 3 - రాయ్పూర్ మూడో వన్డే - డిసెంబర్ 6 - విశాఖపట్నం రోహిత్-కోహ్లీ భవిష్యత్తు గురించి తుది నిర్ణయం రాబోయే రోజుల్లో బీసీసీఐ వైపు నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.