Loading...
Yoga Federation Of India: 'కొందరి జోక్యంతోనే ఎన్‌ఎస్‌ఎఫ్‌ గుర్తింపుపై అనుమానాలు'.. యోగా ఫెడరేషన్‌ ఆరోపణలు
'కొందరి జోక్యంతోనే ఎన్‌ఎస్‌ఎఫ్‌ గుర్తింపుపై అనుమానాలు'.. యోగా ఫెడరేషన్‌ ఆరోపణలు

Yoga Federation Of India: 'కొందరి జోక్యంతోనే ఎన్‌ఎస్‌ఎఫ్‌ గుర్తింపుపై అనుమానాలు'.. యోగా ఫెడరేషన్‌ ఆరోపణలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ క్రీడా సంఘం (ఎన్‌ఎస్‌ఎఫ్‌)గా యోగా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపును పునరుద్ధరించడంలో జాప్యం జరుగుతోందని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి అభినవ్‌ జోషి తెలిపారు. గతంలోనూ గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా సాగకపోవడంతో న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఈసారి కూడా గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం లేదని జోషి ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా మేం న్యాయపోరాటం చేస్తూనే ఉన్నాం. ఒకవేళ గతంలో ఎదురైన పరిస్థితులే మళ్లీ పునరావృతమైతే మరోసారి కోర్టును ఆశ్రయిస్తాం. అదే సమయంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రభుత్వంతో మాకు ఎలాంటి సమస్య లేదు. అయితే కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తుల జోక్యం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.

వివరాలు

త్వరలో పీటీ ఉష, మాండవీయతో భేటీ

ఎన్‌ఎస్‌ఎఫ్‌ గుర్తింపు కోసం ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించామని జోషి చెప్పారు. త్వరలో భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయను కలిసి తమ సమస్యను వివరిస్తామని తెలిపారు.

51 ఏళ్లుగా యోగాసనను ఒక క్రీడగా గుర్తింపు పొందేలా తమ సంఘం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా 700కుపైగా యూనిట్లు తమ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయని, బలమైన సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు.

మెరిట్‌, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నా మా సంఘం చాలా బలంగా ఉంది. ఆరేళ్ల క్రితం ఎన్‌ఎస్‌ఎఫ్‌ గుర్తింపు పొందాం. ఇప్పుడు మరోసారి గుర్తింపు కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని జోషి అన్నారు

వివరాలు

గుర్తింపు లేకుంటే అథ్లెట్లకు ఇబ్బందులు

జాతీయ క్రీడా సంఘంగా గుర్తింపు లేకపోతే యోగాసన అథ్లెట్ల ఎంపిక ప్రక్రియ మరింత క్లిష్టంగా మారుతుందని జోషి వివరించారు.

ఖేలో ఇండియా, జాతీయ స్థాయి పోటీల కోసం ట్రయల్స్‌ నిర్వహించడం కూడా కష్టమవుతుందని చెప్పారు.

దేశవ్యాప్తంగా తమతో కలిసి 2,500 మంది శిక్షణ పొందిన కోచ్‌లు పనిచేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు వందలాది శిక్షణ శిబిరాలను నిర్వహించి యోగాను క్షేత్రస్థాయికి తీసుకెళ్లామని చెప్పారు.

గుర్తింపు దక్కకపోతే అథ్లెట్లు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరో సంస్థ తరఫున పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చినా అథ్లెట్లు దాన్ని వదులుకోవద్దని సూచిస్తున్నామని జోషి తెలిపారు.

అథ్లెట్ల భవిష్యత్తు, వారి హక్కుల పరిరక్షణ కోసమే తాము పోరాడుతున్నామని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు

'రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంది'

నేషనల్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ గుర్తింపు ప్రక్రియలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉన్నట్లు తమకు అనిపిస్తోందని జోషి ఆరోపించారు.

ఇది అంతర్జాతీయ క్రీడా సంఘాల నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

గుర్తింపు ప్రక్రియలో ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకమైన విధానాన్ని అనుసరించాలన్నదే తమ ప్రధాన విజ్ఞప్తి అని యోగా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యదర్శి అభినవ్‌ జోషి తెలిపారు.

ADVERTISEMENT