Year Ender 2025: క్రికెట్ నుంచి ఖోఖో వరకూ.. ఈ ఏడాది భారత్ సాధించిన ఘనతలివే
ఈ వార్తాకథనం ఏంటి
2025 సంవత్సరం భారత క్రీడా చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచింది. క్రికెట్ నుంచి ఖోఖో వరకు, హాకీ నుంచి ఆర్చరీ వరకు... భారత ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా పతకాలు, ట్రోఫీలు సాధిస్తూ దేశ గౌరవాన్ని ఎగరేశారు. ముఖ్యంగా మహిళల క్రికెట్లో భారత్ తొలిసారి ఐసీసీ వరల్డ్ కప్ను గెలుచుకోవడం ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2025లో భారత్ సాధించిన అగ్ర క్రీడా విజయాలివే...
Details
మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజయం
రోహిత్ శర్మ నాయకత్వంలో భారత పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను సొంతం చేసుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి మూడోసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. టోర్నమెంట్ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ విజేతగా నిలవడం విశేషం. శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి కీలక ప్రదర్శనలతో జట్టును విజయతీరాలకు చేర్చారు.
Details
ఖోఖో వరల్డ్ కప్లలో భారత్ హవా
ఇనాగ్యురల్ ఖోఖో వరల్డ్ కప్లో భారత పురుషుల జట్టు చాంపియన్గా అవతరించింది. ఫైనల్లో నేపాల్ను ఓడించి సంప్రదాయ భారత క్రీడలో తన ఆధిపత్యాన్ని చాటింది. అదేవిధంగా మహిళల ఖోఖో జట్టు కూడా ఫైనల్లో నేపాల్పై ఘన విజయం సాధించి వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ ద్వంద్వ విజయాలు దేశంలో ఖోఖోకు మరింత ప్రాచుర్యం తీసుకొచ్చాయి.
Details
వరల్డ్ ఆర్చరీ చాంపియన్షిప్లో చరిత్ర
సెప్టెంబర్లో దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత పురుషుల కంపౌండ్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్లో ఫ్రాన్స్ను 235-233 స్కోర్తో ఓడించి చరిత్ర సృష్టించింది. అదే టోర్నీలో జ్యోతి సురేఖ వెన్నం - రిషబ్ యాదవ్ జోడీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజత పతకం సాధించింది. ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలయ్యారు.
Details
పురుషుల హాకీ ఆసియా కప్ విజయం
సెప్టెంబర్ నెలలో జరిగిన పురుషుల హాకీ ఆసియా కప్లో భారత్ నాలుగోసారి చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను 4-1 తేడాతో ఓడించింది. డిల్ప్రీత్ సింగ్ ఫైనల్లో రెండు గోల్స్ చేసి హీరోగా నిలిచాడు. ఈ విజయంతో భారత్ 2026 హాకీ వరల్డ్ కప్కు కూడా అర్హత సాధించింది.
Details
టీ20 ఆసియా కప్ భారత్ ఖాతాలోకి
దుబాయ్లో జరిగిన టీ20 ఆసియా కప్లో భారత పురుషుల జట్టు రెండోసారి చాంపియన్గా అవతరించింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్ టోర్నమెంట్లోని ఏడు మ్యాచ్లన్నింటిలో విజయం సాధించింది. పాకిస్థాన్ను మూడు సార్లు ఓడించడం విశేషం. అభిషేక్ శర్మ అత్యధిక పరుగులతో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలవగా, కుల్దీప్ యాదవ్ అత్యధిక వికెట్లతో టాప్లో నిలిచాడు.
Details
మహిళల వరల్డ్ కప్లో చిరస్మరణీయ విజయం
భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ను తొలిసారి గెలుచుకుని చరిత్ర సృష్టించింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన షఫాలి వర్మ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచింది. టోర్నమెంట్ మొత్తం అద్భుత ఆల్రౌండ్ ఆటతో దీప్తి శర్మ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు దక్కించుకుంది. ఈ వరల్డ్ కప్లో భారత్ రెండు అత్యధిక జట్టు స్కోర్లను నమోదు చేసింది - ఆస్ట్రేలియాపై 339 లక్ష్యాన్ని ఛేదిస్తూ341/5, న్యూజిలాండ్పై 340/3పరుగులు చేసింది. మొత్తంగా 2025... భారత క్రీడలకు గర్వకారణమైన సంవత్సరం. ప్రపంచ క్రీడా వేదికపై భారత్ శక్తిని మరోసారి చాటిన ఏడాదిగా నిలిచింది.