Shukri Conrad: హార్దిక్ పాండ్యా ప్రత్యేకంగా నిలిచాడు.. దక్షిణాఫ్రికా కోచ్ ప్రశంసల వర్షం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆల్రౌండర్ హర్థిక్ పాండ్యాపై దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ శుక్రి కాన్రాడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీ20 సిరీస్లో రెండు జట్ల మధ్య అసలు తేడా చూపించింది హార్దిక్ పాండ్యానేనని ఆయన స్పష్టంగా వ్యాఖ్యానించాడు. సిరీస్లో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్లో హార్దిక్ 25 బంతుల్లో 63 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెరుపు ప్రదర్శనకు గాను అతడికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. అదే మ్యాచ్లో హార్దిక్ బౌలింగ్లోనూ కీలక పాత్ర పోషించాడు. డీవాల్డ్ బ్రేవిస్ అనే కీలక వికెట్ను పడగొట్టడంతో పాటు, మూడు ఓవర్లలో 41 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ సాధించాడు.
Details
హర్ధిక్ వల్లే ఓడిపోయాం
ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించిన అనంతరం మాట్లాడిన శుక్రి కాన్రాడ్, జస్ప్రీత్ బుమ్రా మంచి బౌలింగ్ చేసినప్పటికీ, హార్దిక్ ప్రదర్శన మాత్రం ప్రత్యేకంగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా కాన్రాడ్ మాట్లాడుతూ నిజం చెప్పాలంటే బుమ్రాను తక్కువ చేసి మాట్లాడటం కాదు. కానీ ఈ రెండు జట్ల మధ్య తేడా చూపించింది హార్దిక్ పాండ్యానే అని నేను భావిస్తున్నాను. ఈ రోజు అతడు ఆడిన ఇన్నింగ్స్ వల్లే మేము ఓడిపోయాం. తొలి మ్యాచ్లో కూడా అతడు వచ్చి మా బౌలర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఈ ఫార్మాట్లో హార్దిక్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎందుకు నిలిచాడో అతని ఆటతోనే అర్థమవుతుంది.
Details
వరుణ్ చక్రవర్తికి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'
సిరీస్ మొత్తం అతని ప్రదర్శన అద్భుతం. మాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరో నాకు తెలియదు కానీ అది హార్దిక్ కాకపోతే నిజంగా ఆశ్చర్యమేనని ప్రశంసించాడు. అయితే 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు మాత్రం హార్దిక్కు కాకుండా వరుణ్ చక్రవర్తికి దక్కింది. వరుణ్ నాలుగు ఇన్నింగ్స్ల్లో 10 వికెట్లు తీసి సిరీస్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా ఈ సిరీస్లో 142 పరుగులు చేసి మూడో అత్యధిక రన్ స్కోరర్గా నిలవడమే కాకుండా, మూడు వికెట్లు కూడా సాధించాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ కీలకంగా రాణిస్తూ సిరీస్ మొత్తం తన విలువను మరోసారి చాటుకున్నాడు.