Pakistan: పాక్ ఆటగాళ్లకు భారీ జరిమానా.. 11 డబ్ల్యూటీసీ పాయింట్లు కోల్పోయిన జట్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లాండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్లో వైట్వాష్కు గురై.. స్వదేశంలోనే అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ మరో షాక్ ఇచ్చింది. బర్మింగ్హామ్లో ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో భారీ కోత విధించింది. అంతేకాకుండా ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC)లో పాక్కు 11 పాయింట్లు కోత విధించింది. మూడో టెస్టులో నిర్ణీత సమయంలోపు పాకిస్థాన్ 11 ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ ఎలైట్ ప్యానెల్కు చెందిన మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లె నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
డబ్ల్యూటీసీలో అట్టడుగుకు పాక్
స్లో ఓవర్ రేట్ కారణంగా డబ్ల్యూటీసీలో పాకిస్థాన్కు 11 పాయింట్లు కోత పడింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో పాకిస్థాన్ అట్టడుగు స్థానానికి పడిపోయింది.
ప్రస్తుతం ఆ జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. పాకిస్థాన్ పాయింట్ల శాతం కేవలం 4.63గా ఉంది.
వివరాలు
స్లో ఓవర్ రేట్పై ఐసీసీ నిబంధనలు ఇవే
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 16.11.12 ప్రకారం.. డబ్ల్యూటీసీలో నిర్ణీత సమయంలో అవసరమైన రేటు కంటే తక్కువగా వేసిన ప్రతి ఓవర్కు ఒక ఛాంపియన్షిప్ పాయింట్ను జట్టు కోల్పోతుంది.
అదే విధంగా ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయం కంటే తక్కువ ఓవర్లు వేసిన ప్రతి ఓవర్కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోత విధిస్తారు.
అయితే మొత్తం పెనాల్టీని గరిష్ఠంగా 50 శాతానికి పరిమితం చేస్తారు.
ఈ నిబంధనల ప్రకారమే పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు.. డబ్ల్యూటీసీలో ఆ జట్టు 11 పాయింట్లు కోల్పోయింది.