
BCCI: బీసీసీఐకి ఆర్టీఐ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చిన క్రీడాశాఖ.. నూతన బిల్లులో కీలక సవరణ
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా - BCCI)కి క్రీడాశాఖ నుండి భారీ ఊరట లభించింది. తాజాగా క్రీడాశాఖ చేసిన సవరణల వల్ల, ప్రపంచంలోనే అత్యంత ధనికమైన క్రికెట్ బోర్డ్ అయిన BCCIకి ఇకపై సమాచార హక్కు చట్టం (RTI Act) వర్తించదని సమాచారం. ఇప్పటి వరకు బీసీసీఐ పూర్తిగా క్రీడాశాఖకి స్వతంత్రంగా ఉండేది. కానీ జూలై 23న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా లోక్సభలో ప్రవేశపెట్టిన "జాతీయ క్రీడల పరిపాలన బిల్లు (National Sports Governance Bill)" ద్వారా BCCIని జాతీయ క్రీడా మండలి (NSB) పరిధిలోకి తీసుకురావాలన్న ప్రణాళిక ఉంది.
వివరాలు
స్వయంప్రతిపత్తిగల సంస్థగా బీసీసీఐ
ఈ బిల్లుతో జాతీయ క్రీడా సమాఖ్యలకు (NSFs) గుర్తింపు ఇవ్వడం, అవి ఎలా పనిచేస్తున్నాయో పర్యవేక్షించడం, పారదర్శకత పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. బిల్లులో BCCIను ఇతర క్రీడా సమాఖ్యల మాదిరిగానే స్వయంప్రతిపత్తిగల సంస్థగా ఉంచనున్నారు. అయితే వివాదాల పరిష్కారం కోసం జాతీయ క్రీడా ట్రైబ్యునల్ ఆధీనంలోకి వస్తుంది. అయితే బిల్లు జూలై 23న లోక్సభలో ప్రవేశపెట్టబడినప్పటికీ, ప్రభుత్వం - ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న పోరాటాల వల్ల చర్చకు రాలేదు.
వివరాలు
RTI నుండి బీసీసీఐను ఎలా తప్పించారు?
ఈ లోకసభ గందరగోళంలో BCCIకి ఒక శుభవార్త లభించింది. తాజా సమాచారం ప్రకారం, క్రీడాశాఖ RTIకి సంబంధించిన ముసాయిదాలో సవరణలు చేసింది. తాజా సవరణ ప్రకారం, ప్రభుత్వ సాయం లేదా నిధులు పొందుతున్న క్రీడా సంస్థలకే RTI చట్టం వర్తిస్తుంది. ముందు క్లాజ్ 15(2) ప్రకారం - "ఈ చట్టం ప్రకారం పని చేస్తున్న గుర్తింపు పొందిన క్రీడా సంస్థలు RTI చట్టం కింద పబ్లిక్ అథారిటీగా పరిగణించబడతాయి" అని పేర్కొనబడ్డది. కానీ BCCI ప్రభుత్వం నుండి నిధులు తీసుకోదని చెబుతూ RTI పరిధిలోకి రావడాన్ని వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తాజా సవరణతో వారికి తలనొప్పులు తొలగినట్లయింది.
వివరాలు
RTI చట్టం ప్రకారం, "పబ్లిక్ అథారిటీ" అంటే..
"ఇప్పటి సవరణ ప్రకారం, పబ్లిక్ అథారిటీ అనేది ప్రభుత్వ నిధులు లేదా సాయం మీద ఆధారపడిన సంస్థ అని స్పష్టంగా నిర్వచించబడింది. లేకపోతే చట్టం న్యాయస్థానాల్లో నిలిచిపోతుండేది," అని ఒక ఉన్నత స్థాయి వర్గీయుడు PTIకి తెలిపారు. "అంతేకాదు, నేరుగా నిధులు తీసుకోకపోయినా, ఏదైనా కార్యక్రమం నిర్వహణలో ప్రభుత్వ మద్దతు (ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి) ఉంటే కూడా ప్రశ్నించవచ్చు. కాబట్టి ఇది కేవలం డబ్బుల గురించి మాత్రమే కాదు," అని ఆయన వివరించారు. RTI చట్టం ప్రకారం, "పబ్లిక్ అథారిటీ" అంటే.. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన చట్టం ద్వారా ఏర్పడిన, లేదా ప్రభుత్వం యాజమాన్యంలో ఉన్న, నియంత్రించబడుతున్న, లేదా ప్రభుత్వ నిధులతో గణనీయంగా ఆర్థికంగా మద్దతిచ్చిన సంస్థలను సూచిస్తుంది.
వివరాలు
BCCI తప్పనిసరిగా జాతీయ క్రీడా సమాఖ్యగా నమోదు కావాలి
ఈ సవరణలతో ఇప్పుడు క్రీడా బిల్లు ఆ నిర్వచనానికి అనుగుణంగా మారింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, క్రికెట్ ఇప్పుడు ఒలింపిక్స్ క్రీడగా గుర్తింపు పొందిన నేపథ్యంలో, BCCI తప్పనిసరిగా జాతీయ క్రీడా సమాఖ్యగా (NSF) నమోదు కావాల్సి ఉంటుంది. 2028లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ ఒలింపిక్స్కు ప్రవేశించనున్న సంగతి తెలిసిందే.