Yashasvi Jaiswal: యశస్వి-అసిత గొడవపై ఐసీసీ యాక్షన్.. ఇద్దరికీ భారీ జరిమానా!
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో మధ్య చోటుచేసుకున్న వాగ్వాదంపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇద్దరూ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12ను ఉల్లంఘించినట్లు తేలడంతో.. చెరో 25 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించింది. అలాగే ఇద్దరి ఖాతాల్లోనూ చెరో డీమెరిట్ పాయింట్ను జమ చేసింది. తొలి రోజు ఆటలో యశస్వీ జైస్వాల్ను ఔట్ చేసిన అనంతరం అసిత ఫెర్నాండో అత్యుత్సాహంగా సెలబ్రేట్ చేశాడు. దీంతో జైస్వాల్ అతడి వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ చాలా దగ్గరగా రావడంతో వారి హెల్మెట్లు తాకాయి.
వివరాలు
ఇద్దరికీ ఫీజులో 25శాతం ఫైన్
పరిస్థితి మరింత ముదరకుండా శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండిస్తో పాటు ఇతర ఆటగాళ్లు, అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ వేరు చేశారు.
ఈ ఘటనపై జైస్వాల్ స్పందిస్తూ.. అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలియకుండా ఎవరినీ జడ్జ్ చేయొద్దని పేర్కొన్నారు.
మరోవైపు భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కూడా ఈ ఘటనపై స్పందించారు. తీవ్ర పోటీ వాతావరణంలో భావోద్వేగాలు అదుపు తప్పడం సహజమేనని చెబుతూనే.. జైస్వాల్ ఫెర్నాండోకు అంత దగ్గరగా వెళ్లకుండా సంయమనం పాటించాల్సిందని అన్నారు.
ఇక ఐసీసీ చర్యల విషయానికి వస్తే.. లెవెల్-1 ఉల్లంఘన కింద ఇద్దరికీ 25 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా, ఒక్కో డీమెరిట్ పాయింట్ విధించారు.