IND vs ENG 5th Test: 5వ టెస్ట్లో టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా?
టీమిండియా, ఇంగ్లండ్ మద్య 5వ టెస్టు ధర్మశాల వేదికగా.. మార్చి 7నుంచి ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా ఇప్పటికే 3-1తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో విజయం సాధించి.. సిరీస్ లో ఆధిపత్యాన్ని కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. ఇదిలా ఉండగా.. చివరి మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నారు. ఆఖరి టెస్టులో కేఎల్ రాహుల్ గైర్హాజరు కావడం వల్ల జట్టు మేనేజ్మెంట్ దేవదత్ పడిక్కల్కు అరంగేట్రం క్యాప్ను అప్పగించాలని నిర్ణయించకపోతే ప్లేయింగ్ ఎలెవెన్లో రజత్ పాటిదార్కు మరో అవకాశం లభించవచ్చు. ధర్మశాల టెస్టు ద్వారా అశ్విన్, జానీ బెయిర్స్టో తమ కెరీర్లో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. ఈ మ్యాచ్ ఇద్దరికీ 100వ టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం.
ధర్మశాలలో అశ్విన్ కెప్టెన్ అవుతాడా?
37 ఏళ్ల అశ్విన్ రాంచీలో తన 99వ టెస్టు ఆడాడు. ఆ మ్యాచ్లో అశ్విన్ రెండో ఇన్నింగ్స్లో 5వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్లో అతను 35వ సారి 5వికెట్లు తీసుకున్నారు. 100వ టెస్టు ఆడనున్న అశ్విన్ను గౌరవించడం కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ధర్మశాల మ్యాచ్లో కెప్టెన్సీ బాధ్యతలను అతనికి అప్పగించాలని సునీల్ గవాస్కర్ సూచించారు. ఇదిలా ఉంటే, జానీ బెయిర్స్టో 100వ టెస్టు మైలురాయిని అందుకున్న 17వ ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు. అతను ఈ విజయాన్ని తన క్యాన్సర్తో బాధపడుతున్న తల్లికి అంకితం చేశాడు, 1932 నుంచి భారత్, ఇంగ్లండ్ 135 టెస్టు మ్యాచ్లు ఆడాయి. ఇంగ్లండ్ 51 విజయాలతో ఆధిక్యంలో ఉండగా, భారత్ 34 విజయాలు సాధించింది.