IND vs ENG: సిరాజ్కు బదులు ప్రసిద్ధ్ ఎందుకు? భువీని పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన టీ20 స్క్వాడ్లో ఒక కీలక మార్పు చర్చనీయాంశంగా మారింది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్కు 'వర్క్లోడ్ మేనేజ్మెంట్'లో భాగంగా విశ్రాంతి కల్పించిన బీసీసీఐ, అతడి స్థానంలో కర్ణాటక ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై క్రికెట్ అభిమానులు,విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సిరాజ్ స్థానాన్ని ప్రసిద్ధ్తో భర్తీ చేయడం కంటే అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్కు మరో అవకాశం ఇవ్వాల్సిందని అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ప్రసిద్ధ్ కంటే భువీ అన్ని విధాలా మెరుగైన ఎంపిక అని పలువురు పోస్టులు చేస్తున్నారు.
వివరాలు
ఐపీఎల్-2026 సీజన్లో అద్భుత బౌలింగ్'తో అక్కటుకున్న భువనేశ్వర్
నవంబర్ 2022 తర్వాత భారత టీ20 జట్టుకు దూరమైన భువనేశ్వర్, దేశవాళీ క్రికెట్తో పాటు ఫ్రాంచైజీ లీగ్ల్లో మాత్రం నిలకడైన ప్రదర్శన చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026 సీజన్లో భువనేశ్వర్ అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 16మ్యాచ్ల్లో 28వికెట్లు సాధించి ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. కొత్త బంతితో స్వింగ్ చేయడంలో ఇప్పటికీ అతడు ప్రత్యేక నైపుణ్యం కనబరుస్తున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లోనూ భువనేశ్వర్కు అద్భుతమైన రికార్డు ఉంది. 87మ్యాచ్ల్లో 90వికెట్లు పడగొట్టిన అతడు 6.96ఎకానమీ రేట్ను నమోదు చేశాడు. 36 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ పరంగా యువ బౌలర్లకు ఏమాత్రం తీసిపోకుండా కనిపిస్తున్న భువీకి మరో అవకాశం ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
వివరాలు
టీ20 ఫార్మాట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ప్రసిద్ధ్ కృష్ణ
అయినప్పటికీ సెలక్టర్లు మాత్రం అతడి పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రసిద్ధ్ కృష్ణ విషయానికి వస్తే.. టెస్టులు, వన్డేల్లో ఫర్వాలేదనిపించినా, టీ20 ఫార్మాట్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 5 టీ20 మ్యాచ్లు ఆడి 8 వికెట్లు మాత్రమే తీశాడు. ఐపీఎల్-2026లో కూడా అతడి ప్రదర్శన పెద్దగా ప్రభావం చూపలేదని అభిమానులు గుర్తుచేస్తున్నారు.
వివరాలు
ఫామ్, అంతర్జాతీయ రికార్డు ఉన్న భువనేశ్వర్ కుమార్ను ఎంపిక మరింత ప్రయోజనం
దీంతో సిరాజ్కు విశ్రాంతి ఇచ్చిన సమయంలో యువ బౌలర్కు అవకాశం ఇవ్వడం కంటే అనుభవం, ఫామ్, అంతర్జాతీయ రికార్డు ఉన్న భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేసి ఉంటే జట్టుకు మరింత ప్రయోజనం చేకూరేదనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే సెలక్టర్ల వ్యూహం ఏమిటి? భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఐర్లాండ్,ఇంగ్లండ్ టీ20లకు భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్),అభిషేక్ శర్మ,సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ ,శివమ్ దూబే, తిలక్ వర్మ(వైస్ కెప్టెన్),నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ సింగ్ పటేల్,వాషింగ్టన్ సుందర్,వరుణ్ చక్రవర్తి,రవి బిష్ణోయ్,హర్షిత్ రాణా,అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.