Loading...
India vs England: చేతులారా మ్యాచ్‌ జారవిడిచిన భారత్‌.. ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి
చేతులారా మ్యాచ్‌ జారవిడిచిన భారత్‌.. ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి

India vs England: చేతులారా మ్యాచ్‌ జారవిడిచిన భారత్‌.. ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2026
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత పురుషుల హకీ జట్టు.. మ్యాచ్‌ సగం ముగిసే సమయానికి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. కానీ కీలక దశల్లో తడబడటంతో ఆ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయింది. ప్రత్యర్థికి వరుస అవకాశాలు ఇచ్చిన హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ బృందం చివరకు 2-4తో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి చవిచూసింది. కీలక సమయాల్లో డిఫెన్స్‌ వైఫల్యం, ప్రణాళికాబద్ధమైన ఆట లోపించడంతో భారత్‌ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది. హాకీ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో వేల్స్‌ను 3-1తో ఓడించి జోరుమీదున్న భారత జట్టు.. రెండో మ్యాచ్‌లో మాత్రం తడబడింది. సోమవారం జరిగిన పూల్‌-డి పోరులో ఇంగ్లాండ్‌ చేతిలో 2-4తో ఓడింది. మ్యాచ్‌ తొలి అర్ధభాగంలో ఎక్కువ సమయం భారత్‌ ఆధిపత్యమే కొనసాగింది.

వివరాలు

పెనాల్టీ కార్నర్ల కోసం పోరాటం

బంతిపై నియంత్రణ సాధిస్తూ, బలమైన డిఫెన్స్‌తో పాటు దూకుడైన ఎటాకింగ్‌ ఆటతో హర్మన్‌ప్రీత్‌ బృందం ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది.

అయితే 14వ నిమిషంలో నికోలాస్‌ బాండ్‌రుక్‌ గోల్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం భారత్‌ పుంజుకుంది.

వేల్స్‌పై అద్భుతంగా రాణించిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 17వ నిమిషంలో మరోసారి తన స్టిక్‌ పవర్‌ చూపించాడు.

పెనాల్టీ కార్నర్‌ను శక్తిమంతమైన షాట్‌గా మలిచి బంతిని నెట్‌లోకి పంపడంతో భారత్‌ స్కోరును 1-1తో సమం చేసింది.

ఆ తర్వాత భారత్‌ గోల్స్‌ కోసం మరింత దూకుడుగా ప్రయత్నించింది. పెనాల్టీ కార్నర్ల కోసం గట్టిగా పోరాడింది. ఈ ప్రయత్నాలకు 25వ నిమిషంలో ఫలితం దక్కింది.

వివరాలు

మూడో క్వార్టర్‌ నుంచి మారిన ఆట

అభిషేక్‌ అందించిన పాస్‌ను ఇంగ్లాండ్‌ గోల్‌కు సమీపంలో అందుకున్న దిల్‌ప్రీత్‌ సింగ్‌ ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా బంతిని నెట్‌లోకి పంపించాడు.

దీంతో భారత్‌ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్‌ ప్రారంభమైన తర్వాత మ్యాచ్‌ పూర్తిగా మలుపు తిరిగింది.

బంతిపై ఆధిపత్యం క్రమంగా ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు వెళ్లింది. 39వ నిమిషంలో రష్‌మీర్‌ అద్భుతమైన షాట్‌తో గోల్‌ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు.

ఆ వెంటనే ఇంగ్లాండ్‌ మరోసారి దాడులు పెంచింది. 43వ నిమిషంలో హెన్రీ క్రాఫ్ట్‌ గోల్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో భారత్‌పై ఒత్తిడి మరింత పెరిగింది.

ADVERTISEMENT

వివరాలు

4-2 తేడాతో ఇంగ్లండ్ విజయం

చివరి క్వార్టర్‌ ప్రారంభంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ రూపంలో మంచి అవకాశం లభించింది. అయితే ఇంగ్లాండ్‌ గోల్‌కీపర్‌ పైన్‌ దానిని అద్భుతంగా అడ్డుకున్నాడు.

ఆ తర్వాత భారత్‌కు మరో ఒకటి, రెండు పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమైంది.

భారత్‌ ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో ఇంగ్లాండ్‌ మరోసారి దాడి చేసింది.

55వ నిమిషంలో బాండ్‌రుక్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో ఇంగ్లాండ్‌ 4-2 ఆధిక్యంలోకి వెళ్లి విజయాన్ని ఖాయం చేసుకుంది.

ADVERTISEMENT

వివరాలు

పాకిస్థాన్‌తో గెలుపు తప్పనిసరి

ఈ ఓటమితో పూల్‌-డి నుంచి ముందంజ వేయాలంటే భారత్‌కు తదుపరి మ్యాచ్‌ కీలకంగా మారింది.

బుధవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ బృందం తప్పక గెలవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం భారత్‌ రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం సాధించి మూడు పాయింట్లతో పూల్‌-డి పట్టికలో రెండో స్థానంలో ఉంది.

ఇంగ్లాండ్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పూల్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు తర్వాతి దశకు అర్హత సాధిస్తాయి.

ఇదిలా ఉండగా, పూల్‌-బి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌, మలేసియా 3-3తో డ్రా చేసుకున్నాయి. పూల్‌-డి మరో మ్యాచ్‌లో పాకిస్థాన్‌, వేల్స్‌ కూడా 3-3తోనే మ్యాచ్‌ను ముగించాయి.

వివరాలు

మహిళల విభాగంలో అర్జెంటీనా విజయం

మహిళల హాకీ ప్రపంచకప్‌లో పూల్‌-బి మ్యాచ్‌లో అర్జెంటీనా 3-2తో జర్మనీపై విజయం సాధించింది.

యుజీనా 3వ నిమిషంలో గోల్‌ చేయగా.. అగస్టీనా 48వ, 56వ నిమిషాల్లో గోల్స్‌ చేసి అర్జెంటీనా విజయంలో కీలక పాత్ర పోషించింది.

మహిళల ప్రపంచకప్‌లో మరో పూల్‌-బి మ్యాచ్‌లో అమెరికా 3-2తో స్కాట్లాండ్‌ను ఓడించింది.

పూల్‌-ఎలో జపాన్‌ 3-0తో చిలీని చిత్తు చేసింది. పూల్‌-సిలో స్పెయిన్‌ 3-2తో ఐర్లాండ్‌పై విజయం సాధించింది.

ADVERTISEMENT