LOADING...
Team India: టీమ్‌ఇండియా మూడో నంబర్‌ గందరగోళం: సుదర్శన్‌పై వేటు ఎందుకు?
టీమ్‌ఇండియా మూడో నంబర్‌ గందరగోళం: సుదర్శన్‌పై వేటు ఎందుకు?

Team India: టీమ్‌ఇండియా మూడో నంబర్‌ గందరగోళం: సుదర్శన్‌పై వేటు ఎందుకు?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెస్టు క్రికెట్లో మూడో నంబర్‌ బ్యాటింగ్‌ స్దానం అత్యంత కీలకం. సాధారణంగా జట్టులో అత్యంత నమ్మకమైన, టెక్నిక్‌ పక్కాగా ఉన్న బ్యాటర్‌ను ఈ స్థానం కోసం ఎంపిక చేస్తారు. ఇన్నింగ్స్‌కు బలమైన ఆరంభం ఇవ్వడంలో, ఒక వేళ త్వరగా వికెట్లు కోల్పోతే మ్యాచ్‌ను తిరిగి గాడిన పెట్టడంలో ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఈ స్థానంలో ఆడేవారికి కీలక బాధ్యత ఉంటుంది. అలాంటి ముఖ్యమైన చోట జట్టు చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు విమర్శలకు గురవుతున్నాయి.

వివరాలు 

 ద్రవిడ్‌ తర్వాత అదే బాధ్యతను చెతేశ్వర్‌ పుజారా.. 

టీమ్‌ఇండియా టెస్టు చరిత్రలో మూడో నంబర్‌ బ్యాటర్‌గా అత్యధిక కాలం సేవలందించిన బ్యాటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌. ద్రవిడ్‌ ఆ స్థానానికి ప్రత్యేక విలువను తీసుకొచ్చి దాని ప్రాధాన్యతను పెంచాడు. ఇన్నింగ్స్‌ ప్రారంభంలో ఒత్తిడి వచ్చినా, వరుసగా వికెట్లు పడినా క్రీజ్‌ను కాపాడుతూ జట్టును నిలబెట్టేవాడు. ఆఖరికి మంచి పునాది ఏర్పడితే భారీ స్కోర్‌ దిశగా నడిపించేవాడు. ద్రవిడ్‌ తర్వాత అదే బాధ్యతను చెతేశ్వర్‌ పుజారా దశాబ్దానికి పైగా అద్భుతంగా నిర్వర్తించాడు. కానీ పుజారా జట్టుకు దూరమైన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడంలో భారత జట్టు సరైన ప్లాన్‌ కనుగొనలేక ఇరుక్కుపోతోంది. మిగతా స్థానాల్లో పెద్దగా సమస్యలు లేకపోయినా, మూడో నంబరులో మాత్రం ఇంకా ఎవరూ స్థిరపడలేకపోతున్నారు.

వివరాలు 

కరుణ్‌ నాయర్‌, సాయి సుదర్శన్‌లకు మారుస్తూ మారుస్తూ అవకాశాలు 

పుజారాపై వేటు పడ్డాక కొంత కాలం శుభమన్‌ గిల్‌ ను ఆ స్థానంలో ఆడించారు. అతను పెద్దగా ఇంపాక్ట్‌ చూపించలేకపోయాడు. ఈఏడాది రోహిత్‌,కోహ్లి టెస్టులకు గుడ్‌బై చెప్పిన తర్వాత గిల్‌ స్థానమే మారిపోయింది. రోహిత్‌ రిటైర్మెంట్‌తో కెప్టెన్సీ చేపట్టిన అతను,కోహ్లి ఆడే నాలుగో స్థానానికి మారాడు. ఇంగ్లాండ్‌ సిరీస్‌ నాటినుంచే అక్కడే బ్యాట్‌ చేస్తున్నాడు.ఆ సిరీస్‌లో మూడోస్థానంలో కరుణ్‌ నాయర్‌, సాయి సుదర్శన్‌లకు మారుస్తూ మారుస్తూ అవకాశాలు ఇచ్చారు. కానీ ఇద్దరూ ఆయా అవకాశాలను పూర్తిగా క్యాష్‌ చేసుకోలేదు.తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్‌కు కరుణ్‌పై వేటు పడింది. సుదర్శన్‌కు ఛాన్స్‌ వచ్చింది. అతడే మూడో స్థానంలో ఆడి రెండో టెస్టులో 87,39 పరుగులతో రాణించాడు. దీంతో ఇక అతనే మూడో స్థానంలో కొనసాగుతాడనిపించింది.

వివరాలు 

అయితే ఇది సరైన నిర్ణయమేనా? 

ప్రపంచ టెస్టు చాంపియన్స్‌ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభమైన వెంటనే జట్టు ప్రకటించిన తుది ప్లేయింగ్‌ ఎలెవన్‌ అందరికీ షాక్‌ ఇచ్చింది. ఆరుగురు బౌలర్లతో వెళ్లి,స్పెషలిస్టు బ్యాటర్లను ఐదుగురితోనే పరిమితం చేశారు. ఈ క్రమంలో మూడో స్థానంలో ఆడే సాయి సుదర్శన్‌ను పక్కన పెట్టారు. పంత్‌తో పాటు మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ను తీసుకున్నారు.జురెల్‌ మంచి ఫామ్‌లో ఉండడంతో అతణ్ని ఎలాగైనా ఆడించాలనుకున్నారు. కానీ దాని కోసం కీలకమైన మూడో స్థానంలోని స్థిరమైన బ్యాటర్‌పై వేటు వేసి, బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను అక్కడికి పంపడం పెద్ద చర్చకు తెరలేపింది.

వివరాలు 

అయితే ఇది సరైన నిర్ణయమేనా? 

ఈ నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టారు. మాజీ పేసర్‌ దొడ్డ గణేష్‌ కూడా కెప్టెన్‌ శుభ్‌మన్‌, కోచ్‌ గంభీర్‌లను ప్రశ్నిస్తూ—ఇప్పుడే రాణించిన సుదర్శన్‌ను ఎలా పక్కన పెడతారని, టెస్టుల్లో అతి ప్రధానమైన మూడో స్థానంలో ఎలా ఇలా ప్రయోగాలు చేస్తారని విమర్శించాడు. ఈ మ్యాచ్‌లో సుందర్‌ 29, 31 పరుగులతో మొత్తంగా 60 రన్స్‌ చేసి సహకరించినా... భవిష్యత్తులో, ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో, ఒక స్థిరమైన మూడో నంబర్‌ బ్యాటర్‌ లేకపోతే ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక ముందూ గంభీర్‌, శుభ్‌మన్‌ ఈ స్థానంలో మార్పులు చేస్తారా? లేక ఒకరికే కట్టుబడతారా? అన్నది చూడాల్సి ఉంది.