LOADING...
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ అజేయ రికార్డు..ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ జట్టుగా గుర్తింపు
టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ అజేయ రికార్డు..ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ జట్టుగా గుర్తింపు

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ అజేయ రికార్డు..ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ జట్టుగా గుర్తింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటివరకు టీమిండియా ఆడిన మ్యాచ్‌లు, సాధించిన విజయాలు పరిశీలిస్తే.. పొట్టి ఫార్మాట్‌లో భారత్ ఎంత స్థిరమైన, శక్తివంతమైన జట్టో స్పష్టంగా తెలుస్తుంది. గణాంకాల పరంగా చూస్తే.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌నే అత్యుత్తమ జట్టుగా చెప్పాల్సిందే. భారత్ ఇప్పటివరకు మొత్తం 53 టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 36 విజయాలు, 15ఓటములు ఎదుర్కోగా, 2 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి. ఈ ప్రదర్శనతో టీ20వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ 70.5శాతం విన్నింగ్ పర్సెంటేజ్ నమోదు చేసింది. ఇది ఈ టోర్నీలో పాల్గొన్న అన్ని జట్లలోనే అత్యధికం కావడం విశేషం. అంతేకాదు ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా కూడా టీమిండియా ప్రత్యేక రికార్డు నెలకొల్పింది.

Details

ప్రతి వరల్డ్ కప్ లోనూ నాకౌట్ దశకు అర్హత

టైటిల్స్ పరంగా కూడా భారత్‌ది బలమైన స్థానం. 2007లో తొలి టీ20 వరల్డ్‌కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత్, ఆ తర్వాత 2024లో మరోసారి ట్రోఫీని సొంతం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అలాగే 2014లో రన్నరప్‌గా నిలవగా, 2016, 2022 ఎడిషన్లలో సెమీఫైనల్స్‌కు చేరింది. దాదాపు ప్రతి వరల్డ్‌కప్‌లోనూ నాకౌట్ దశకు చేరడం భారత్ స్థిరత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అన్ని గణాంకాలను పరిశీలిస్తే.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్‌ను 'గ్రేటెస్ట్ T20I టీమ్ ఆఫ్ ఆల్ టైమ్'గా పేర్కొనడంలో ఎలాంటి సందేహం లేదు.

Details

ప్రతి టోర్నీలోనూ టైటిల్ ఫేవరెట్ గా భారత్

స్టార్ ప్లేయర్ల అనుభవం, యువ ఆటగాళ్ల ప్రతిభ, బలమైన బెంచ్ స్ట్రెంత్‌తో టీమిండియా ప్రతి టోర్నీలోనూ టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తోంది. రాబోయే ఎడిషన్లలో ఈ రికార్డులు మరింత మెరుగయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా టీ20 వరల్డ్‌కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈసారి ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. బలమైన గణాంకాలు, అనుభవం, హోం అడ్వాంటేజ్ నేపథ్యంలో ఈసారి కూడా భారత్ ప్రధాన టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.

Advertisement