Archery World Cup: దక్షిణ కొరియాకు షాకిచ్చిన భారత్.. ఆర్చరీ వరల్డ్కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన మహిళల జట్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2లో భారత మహిళల రికర్వ్ జట్టు సంచలన ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో పదిసార్లు ఒలింపిక్ ఛాంపియన్ అయిన సౌత్ కొరియాకు భారత్ షాకిచ్చింది. దీపికా కుమారి, అంకిత భకత్, కుంకుమ్ మొహొద్లతో కూడిన భారత జట్టు 5-1 తేడాతో దక్షిణ కొరియాను ఓడించి టోర్నీలో తొలి పతకాన్ని ఖాయం చేసుకుంది. నాలుగో సీడ్గా బరిలోకి దిగిన భారత్ మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. తొలి సెట్లో నాలుగు పర్ఫెక్ట్ 10లు సాధిస్తూ మొత్తం 58 పాయింట్లు నమోదు చేసిన భారత ఆర్చర్లు, 55 పాయింట్లకే పరిమితమైన దక్షిణ కొరియాపై ఆధిపత్యం చాటారు.
వివరాలు
5-1 తేడాతో భారత్ ఘన విజయం
రెండో సెట్లో ఇరు జట్లు 56-56తో సమంగా నిలిచినా, భారత్ మొత్తం స్కోరులో 3-1తో ఆధిక్యం కొనసాగించింది. నిర్ణయాత్మక మూడో సెట్లో మరోసారి భారత మహిళలు అద్భుత ప్రదర్శన కనబరిచారు. 58 పాయింట్లు సాధించిన భారత్ ముందు, దక్షిణ కొరియా 56 పాయింట్లకే పరిమితమైంది. దీంతో 5-1తో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ చైనాతో దీపిక కుమారి బృందం తలపడనుంది. మరోవైపు పురుషుల విభాగంలో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. తరుణ్దీప్ రాయ్, ధీరజ్ బొమ్మదేవర, యశ్దీప్ భోగేలతో కూడిన భారత పురుషుల జట్టు 2-6తో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది.
వివరాలు
పురుషుల విభాగంలో భారత జట్టుకు నిరాశ
మిక్స్డ్ టీమ్ విభాగంలోనూ భారత్కు చేదు అనుభవమే ఎదురైంది. రెండో రౌండ్లో ధీరజ్ బొమ్మదేవర-అంకిత భకత్ జోడీ 4-5 (19-19) తేడాతో బ్రెజిల్ జంట చేతిలో పరాజయం చవిచూసింది. నిర్ణీత స్కోరు సమంగా ముగియడంతో షూటాఫ్ నిర్వహించగా, లక్ష్యానికి అత్యంత సమీపంగా బాణం సంధించిన బ్రెజిల్ జోడీ విజేతగా నిలిచింది.