IPL 2026 : కుల్దీప్పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి క్రమంగా క్షీణిస్తోంది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఓడిన అనంతరం జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించాడు. ముఖ్యంగా తన స్పిన్ భాగస్వామి కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీశాయి.
వివరాలు
ఫామ్లో లేని కుల్దీప్..
వికెట్లు సాధించడంలో కుల్దీప్ విఫలమవ్వడం జట్టు ఓటమికి ప్రభావం చూపిందని అక్షర్ పరోక్షంగా తెలిపాడు. ఆ మ్యాచ్లో కుల్దీప్ బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేదు. మూడు ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మ్యాచ్ అనంతరం అక్షర్ మాట్లాడుతూ, తన బౌలింగ్ భాగస్వామి పదును కనిపించలేదని చెప్పాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ కుల్దీప్ ప్రభావం చూపలేకపోవడం ఓటమికి ప్రధాన కారణంగా భావించాడు. సాధారణంగా ఈ ఇద్దరూ కలిసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తారు, కానీ ఈ సీజన్లో కుల్దీప్ ఫామ్లో లేకపోవడం ఢిల్లీకి పెద్ద లోటుగా మారింది.
వివరాలు
అందుకే మ్యాచ్ ఓడిపోయాం..
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 155 పరుగులకే పరిమితమైంది. దీనిపై అక్షర్ మాట్లాడుతూ, పిచ్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఆ స్కోర్ సరిపోతుందని అనిపించినట్లు తెలిపారు. ఎనిమిది మంది బ్యాటర్లతో బరిలోకి దిగిన నేపథ్యంలో మరో 10 నుంచి 15 పరుగులు ఎక్కువ చేయాల్సిందని అంగీకరించాడు. టాప్ ఆర్డర్ త్వరగా ఔటైనప్పటికీ సమీర్ రిజ్వీ (40 నాటౌట్), త్రిష్టన్ స్టబ్స్ (38) పోరాటం వల్ల ఆ మాత్రం స్కోర్ సాధ్యమైందని పేర్కొన్నాడు. అదే ఈ మ్యాచ్లో ఒకే ఒక్క సానుకూల అంశమని చెప్పాడు.
వివరాలు
ఆ తప్పిదాలకు చోటివ్వకూడదని స్పష్టం..
ప్రస్తుతం ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. రాబోయే మ్యాచ్ల గురించి అక్షర్ మాట్లాడుతూ, ఇకపై తప్పిదాలకు చోటివ్వకూడదని స్పష్టం చేశాడు. ప్లేఆఫ్స్ అవకాశాలను నిలుపుకోవాలంటే స్పష్టమైన ఆలోచనతో ఆడాల్సిన అవసరం ఉందని చెప్పాడు. వచ్చే శుక్రవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరగబోయే మ్యాచ్ అత్యంత కీలకమని, ఆ పోరులో తప్పక గెలవాలని జట్టుకు సూచించాడు. కుల్దీప్ మళ్లీ తన పాత ఫామ్ను అందుకుంటేనే ఢిల్లీ విజయావకాశాలు మెరుగుపడతాయని అభిమానులు భావిస్తున్నారు.