IPL 2026 Finals: చెలరేగిన కోహ్లీ.. ఈసారి కూడా కప్ వారిదే.. ఐపీఎల్ 2026 విజేతగా ఆర్సీబీ
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కల మరోసారి నెరవేరింది. మరోసారి ఐపీఎల్ టైటిల్ను ఆర్సీబీ ముద్దాడింది. ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో విరాట్ కోహ్లీ అలుపెరగని కృషికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఎంత మంచి జట్టుతో ఆడినా.. ఎంత మంది మేటి ఆటగాళ్లతో బరిలో నిలిచినా దక్కని టైటిల్.. 19వ ప్రయత్నంలో మరోసారి ఆర్సీబీ ఒడిలోకి వచ్చి చేరింది. టైటిల్తో పాటు ఈ సీజన్లో ఆర్సీబీ అనేక అరుదైన ఘనతలను సొంతం చేసుకుంది.
వివరాలు
గుజరాత్ స్కోరును కట్టడి చేసిన రసిఖ్ సలామ్ దార్..
ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్ రసిఖ్ సలామ్ దార్ అద్భుత బౌలింగ్తో గుజరాత్ టైటాన్స్ (జీటీ) బ్యాటింగ్ను దెబ్బతీశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టిన అతడు, గుజరాత్ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. మ్యాచ్లో మూడు ముఖ్యమైన వికెట్లు సాధించిన రసిఖ్ సలామ్ దార్, గుజరాత్ జట్టును 20 ఓవర్లలో 155/8 స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతూ వరుసగా వికెట్లు తీసి జీటీని కష్టాల్లోకి నెట్టాడు.
వివరాలు
నిరాశపరిచిన శుభ్మన్ గిల్
ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో గిల్ అద్భుతమైన కవర్ డ్రైవ్తో బౌండరీ సాధించాడు. అనంతరం హాజిల్వుడ్ బౌలింగ్లో కూడా ఒక ఫోర్ కొట్టాడు. పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్ టైమింగ్ మిస్ అయ్యాడు. బంతి గాల్లోకి లేచడంతో మిడ్-ఆఫ్ వద్ద ఉన్న రజత్ పాటిదార్ సులభంగా క్యాచ్ అందుకున్నాడు. ఫైనల్లో పెద్ద స్కోరు చేయలేకపోయినా, ఐపీఎల్ 2026 సీజన్ను గిల్ అద్భుత ప్రదర్శనతో ముగించాడు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు.
వివరాలు
కోహ్లీ అద్భుత హాఫ్ సెంచరీ..చెలరేగిపోయాడిలా..
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెరుపులు మెరిపించాడు. లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి శుభారంభం అందించిన కోహ్లీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతడు కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ హాఫ్ సెంచరీతో కోహ్లీ ఓ ప్రత్యేక రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో అతడు నమోదు చేసిన అత్యంత వేగవంతమైన అర్ధశతకం ఇదే కావడం విశేషం.