Mumbai Indians : రాజస్థాన్ ఓడితేనే ఛాన్స్.. ముంబై విజయాన్ని కోరుకుంటున్న సీఎస్కే, కేకేఆర్, పంజాబ్, ఢిల్లీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్లో తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి. అయితే ఇంకా ఒకే ఒక ప్లేఆఫ్స్ బెర్త్ మాత్రమే మిగిలి ఉండగా, దానికోసం ఐదు జట్లు గట్టిగా పోటీపడుతున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం పోటీ పడుతున్నాయి. వీటిలో రాజస్థాన్ రాయల్స్కు ఇతర జట్లతో పోలిస్తే కొంత ఆధిక్యం కనిపిస్తోంది.
వివరాలు
కచ్చితంగా ఆ మ్యాచ్ గెలవాల్సిందే..
మంగళవారం లక్నోపై విజయం సాధించిన ఆ జట్టు, మే 24న వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ పై గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండానే నేరుగా ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ చివరి మ్యాచ్లో ముంబై చేతిలో ఓడిపోతే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అప్పుడు పంజాబ్, చెన్నై, ఢిల్లీ, కోల్కతా జట్లకు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఆ సమయంలో నెట్ రన్రేట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కోల్కతా నైట్రైడర్స్ పరిస్థితి కూడా దాదాపు పంజాబ్ తరహాలోనే ఉంది. రాజస్థాన్ తమ చివరి మ్యాచ్లో ఓడిపోవడం, అదే సమయంలో అజింక్య రహానే నాయకత్వంలోని కేకేఆర్ తమ మిగిలిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధించడం అవసరం.
వివరాలు
కోల్కతా ప్లేఆఫ్స్లోకి ప్రవేశించే అవకాశం..
అదనంగా పంజాబ్ తమ చివరి మ్యాచ్లో ఓడిపోతే, కోల్కతా ప్లేఆఫ్స్లోకి ప్రవేశించే అవకాశాలు బలపడతాయి. ఒకవేళ పంజాబ్ గెలిస్తే, ఆ రెండు జట్ల మధ్య నెట్ రన్రేట్ ఆధారంగా నిర్ణయం తీసుకోబడుతుంది. మెరుగైన రన్రేట్ కలిగిన జట్టుకే ప్లేఆఫ్స్ టికెట్ దక్కుతుంది. మొత్తంగా చూస్తే రాజస్థాన్ రాయల్స్ చివరి మ్యాచ్ ఫలితమే మిగతా నాలుగు జట్ల భవిష్యత్తును నిర్ణయించనుంది. రాజస్థాన్ ఓడితేనే పంజాబ్, చెన్నై, ఢిల్లీ, కోల్కతా జట్లకు ప్లేఆఫ్స్ అవకాశాలు తెరుచుకుంటాయి. అందుకే ఆయా జట్ల అభిమానులు కూడా రాజస్థాన్ పరాజయాన్ని కోరుకుంటూ, ముంబై ఇండియన్స్ విజయం సాధించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.