IPL 2026 : ప్లేఆఫ్స్లో వాన పడితే.. రిజర్వ్ డే పరిస్థితేంటి? విజేతను నిర్ణయిస్తారిలా..
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 26 నుంచి ప్లేఆఫ్స్ పోటీలు ప్రారంభం కానుండగా, క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్ల అనంతరం మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. అయితే ఈ కీలక మ్యాచ్ల సమయంలో వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా, మ్యాచ్ రద్దయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు? రిజర్వ్ డే ఉందా లేదా? అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
వివరాలు
బీసీసీఐ నిబంధనలు ఇవే..
బీసీసీఐ అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం, ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్లోని క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్లకు రిజర్వ్ డే ఏర్పాటు చేయలేదు. కేవలం మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్కే రిజర్వ్ డే అందుబాటులో ఉంటుంది. అందువల్ల తొలి మూడు ప్లేఆఫ్ మ్యాచ్లు వర్షం కారణంగా అంతరాయం కలిగితే, అదే రోజున ఫలితాన్ని తేల్చే ప్రయత్నం చేస్తారు. వర్షం కారణంగా ఆట ఆలస్యమైన సందర్భంలో కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు ప్రయత్నిస్తారు. ఇందుకోసం సాధారణ షెడ్యూల్కు అదనంగా రెండు గంటల సమయాన్ని కేటాయిస్తారు. ఈ అదనపు సమయంలో అయినా మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంటే, తగ్గించిన ఓవర్లతో ఆటను పూర్తి చేస్తారు.
వివరాలు
విజేతను ప్రకటిస్తారిలా..
అయితే భారీ వర్షం కారణంగా ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడితే, కనీసం ఒక ఓవర్ సూపర్ ఓవర్ నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే, లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో ఉన్న స్థానాలను ఆధారంగా తీసుకుని విజేతను నిర్ణయిస్తారు. అంటే, ఆ మ్యాచ్లో పోటీపడుతున్న రెండు జట్లలో లీగ్ దశలో మెరుగైన స్థానం సాధించిన జట్టుకే ఆధిక్యం లభిస్తుంది. ఉదాహరణకు క్వాలిఫైయర్-1లో ఆడుతున్న జట్లలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును నేరుగా విజేతగా ప్రకటించి ఫైనల్కు పంపిస్తారు. ఇదే విధానం ఇతర ప్లేఆఫ్ మ్యాచ్లకూ వర్తిస్తుంది.