IPL 2026: ఐపీఎల్ నిబంధనలపై గంగూలీ షాకింగ్ కామెంట్స్..'ఇంపాక్ట్ ప్లేయర్'పై క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్లో ప్రస్తుతం చర్చకు దారి తీస్తున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' నియమం ఇకపై కూడా అమలులోనే ఉంటుందని భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఈ నియమం వల్ల తమలాంటి ఆల్రౌండర్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కామెంట్స్ చేసిన తర్వాతి రోజే గంగూలీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం కొనసాగుతుందని తాను నమ్ముతున్నట్లు గంగూలీ అన్నారు. తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆ నియమాన్ని ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. కొంతమందికి అది అనుకూలంగా అనిపించవచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చని, అయినప్పటికీ ఈ నియమం కొనసాగుతూనే ఉంటుందని గంగూలీ పేర్కొన్నాడు.
వివరాలు
ఈసారి మరింత జోష్తో ఐపీఎల్..
ప్రస్తుతం టీ20 క్రికెట్ విపరీతంగా ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ, టెస్టు క్రికెటే అత్యంత బలమైన, అసలైన ఫార్మాట్ అని సౌరభ్ అభిప్రాయపడ్డాడు. టెస్టు మ్యాచ్లలో ఒక బౌలర్ రోజుకు 20 నుంచి 25 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. కానీ టీ20ల్లో కేవలం 4 ఓవర్లు మాత్రమే వేయడం చాలా సులభం. నైపుణ్య పరంగా పరిశీలిస్తే టీ20 ఫార్మాట్ తక్కువ సవాళ్లతో ఉంటుంది. అయితే సాయంత్రం సమయంలో ఫోర్లు, సిక్సర్లతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఆకర్షించేది మాత్రం టీ20 ఫార్మాటే అని గంగూలీ చెప్పాడు. ఈసారి ఐపీఎల్ మరింత ఆహ్లాదకరంగా, రసవత్తరంగా సాగనుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు.
వివరాలు
కొందరికి ఇష్టం..మరికొందరికి నష్టం..
ఐపీఎల్లో 'ఇంపాక్ట్ ప్లేయర్' నియమం ప్రవేశించినప్పటి నుంచి ఇది జట్ల వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. మ్యాచ్ పరిస్థితులను బట్టి ఒక ఆటగాడిని మార్చుకునే అవకాశం ఉండటం వల్ల జట్లు మరింత దూకుడుగా ఆడేందుకు వీలు కలుగుతోంది. ముఖ్యంగా బ్యాటింగ్ బలాన్ని పెంచడం లేదా అదనపు బౌలర్ను ఉపయోగించడం వంటి నిర్ణయాల్లో ఈ నిబంధన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ నియమంపై విమర్శలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత క్రికెటర్లు ఈ విధానం వల్ల ఆల్రౌండర్ల ప్రాధాన్యం తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. జట్టులో ప్రత్యేకంగా బ్యాట్స్మెన్ లేదా బౌలర్ను మార్చుకునే అవకాశంతో, రెండింటినీ సమానంగా చేయగల ఆటగాళ్లకు అవకాశాలు తగ్గుతున్నాయని వారు చెబుతున్నారు.