Axar Patel: టీ20 వైస్ కెప్టెన్ అక్షర్పటేల్కు గ్రేడ్ సీనా?.. బీసీసీఐపై మాజీ క్రికెటర్ ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
బీసీసీఐ (BCCI) తాజాగా ప్రకటించిన 2025-26 సీజన్కు సంబంధించిన వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా టీ20 జట్టు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను (Axar Patel) గ్రేడ్ బీ నుంచి నేరుగా గ్రేడ్ సీలోకి దిగజార్చడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈసారి బీసీసీఐ కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో ఏ+ గ్రేడ్ను పూర్తిగా తొలగించింది. ఏ గ్రేడ్లో మాత్రం కేవలం ముగ్గురు ఆటగాళ్లకే అవకాశం కల్పించింది. జస్ప్రీత్ బుమ్రా , శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లను బీ గ్రేడ్లోకి చేర్చింది.
Details
అర్ష్దీప్ సింగ్ను గ్రేడ్ సీలో ఉంచడం సరికాదు
అయితే టీ20 జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న అక్షర్ పటేల్ను బీ గ్రేడ్ నుంచి సీ గ్రేడ్కు తగ్గించడమే కాకుండా, హార్దిక్ పాండ్య (Hardik Pandya), కేఎల్ రాహుల్ (KL Rahul), కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)లకు గ్రేడ్ ఏ ఇవ్వకపోవడంపై ఆకాశ్ చోప్రా తీవ్ర విమర్శలు గుప్పించాడు. అలాగే అర్ష్దీప్ సింగ్ను కూడా గ్రేడ్ సీలో ఉంచడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈ విషయమై 'ఎక్స్' వేదికగా స్పందించిన ఆకాశ్ చోప్రా, "అక్షర్ పటేల్ తనకు అర్హత ఉన్నదాన్ని పొందాలంటే ఇంకా ఏం చేయాలి? అతడు మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు.
Details
గ్రేడ్ ఏ జాబితాలో కేవలం ముగ్గురే ఉండడం శోచనీయం
అన్నింటికన్నా ముఖ్యంగా టీ20 జట్టు వైస్ కెప్టెన్. అలాంటి ఆటగాడికి గ్రేడ్ సీ ఎలా ఇస్తారని ప్రశ్నించాడు. జడేజా, గిల్ గ్రేడ్ ఏలో ఉంటే, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ ఎందుకు లేరు? అర్ష్దీప్ సింగ్ గ్రేడ్ సీలో ఉండాల్సిన ఆటగాడు కాదని స్పష్టం చేశాడు. అదేవిధంగా గ్రేడ్ ఏ జాబితాలో కేవలం ముగ్గురే ఉండటాన్ని కూడా ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. "గ్రేడ్ ఏలో శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా మాత్రమే ఉన్నారు. రెండు ఫార్మాట్లు ఆడుతున్న గిల్, జడేజా అక్కడ ఉన్నప్పుడు హార్దిక్, రాహుల్ చేసిన తప్పేంటి?" అని ప్రశ్నించాడు.
Details
బీసీసీఐ కాంట్రాక్టు సరిగా అనింపించడం లేదు
మూడు ఫార్మాట్లలో ఆడుతున్న కుల్దీప్ యాదవ్ పరిస్థితిని ప్రస్తావించిన ఆకాశ్ చోప్రా, "అక్షర్ పటేల్ టీ20 జట్టు వైస్ కెప్టెన్. వన్డేలు కూడా ఆడతాడు. టెస్టుల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. అయినప్పటికీ అతడికి గ్రేడ్ సీ మాత్రమే ఇచ్చారని వ్యాఖ్యానించాడు. అర్ష్దీప్ సింగ్ భారత జట్టు అత్యుత్తమ టీ20 బౌలర్. అయినా అతడికీ గ్రేడ్ సీ కేటాయించారని అన్నాడు. అలాగే మూడు ఫార్మాట్లలో ఆడుతున్న మహ్మద్ సిరాజ్ను కేవలం గ్రేడ్ బీలో ఉంచడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరగా నిజాయితీగా చెప్పాలంటే ఈ మొత్తం కాంట్రాక్ట్ జాబితా నాకు సరిగా అనిపించడం లేదు. అక్షర్ పటేల్ను కచ్చితంగా గ్రేడ్ ఏలోకి తీసుకోవాల్సిందంటూ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా వెల్లడించాడు.